సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మరోసారి బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. తాము యువత కోసం ల్యాప్టాప్లు అందజేస్తే.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని లాఠీలతో కొట్టించిందని అన్నారు. సమాజ్వాది పార్టీ లోహియా ఆవాస్ పథకం కింద పేద ప్రజలకు ఇండ్లు నిర్మించి ఇస్తే.. బీజేపీ లఖింపూర్ ఖేరీలో రైతులను కారుతో తొక్కించిందని విమర్శించారు. సమాజ్వాది పార్టీ రాష్ట్ర అభివృద్ధిని నమ్ముకుంటే.. బీజేపీ వివిధ ప్రాజెక్టుల పేర్లను మార్చడంపై నమ్మకం పెట్టుకుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది.రాష్ట్ర ప్రజలు ఇప్పుడు యోగీ ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదని, యోగ్యమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు బీజేపీ హయాంలో ప్రారంభోత్సవాలు చేస్తున్న ప్రాజెక్టులన్నీ గతంలో ఎస్పీ హయాంలో ప్రారంభించినవేనని చెప్పారు.