రాజస్థాన్లోని జోధ్ పూర్ నగరంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రంజాన్ పర్వదినమైన ఈరోజు తెల్లవారుజామున ఉద్రిక్తతలు తలెత్తాయి.జలోరి గేట్ ప్రాంతంలో రెండు మతాలకు చెందిన జెండాలు ఎగరేయడం వివాదానికి దారితీసింది. మంగళవారం రంజాన్ కాగా.. మూడు రోజులపాటు నిర్వహించే పరశురాం జయంతి పండగ కూడా జోధ్పూర్లో జరుగుతోంది. పరశురామ్ జయంతి, రంజాన్ రెండు పండుగల నేపథ్యంలో ఇరు మతస్థులు వారివారి మతపరమైన జెండాలను ఎగురవేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య వాదన ప్రారంభమై, చివరకు ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో జనాలను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. ఇదే సమయంలో పోలీసులపై కూడా కొందరు రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను రంగంలోకి దించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ, అందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.