తమ ప్రభుత్వం నిజాయితీ ప్రభుత్వమని, రాజకీయ కారణాలతోనే సత్యేందర్ను టార్గెట్ చేశారని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై ఇవాళ కేజ్రీవాల్ స్పందించారు. సత్యేందర్పై ఉన్న ఈడీ కేసును వ్యక్తిగతంగా అధ్యయనం చేశానని, అదో మోసపూరిత కేసు అని అన్నారు. తాము అవినీతిని తట్టుకోలేమని, అవినీతికి పాల్పడేది కూడా లేదని అన్నారు. మన న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని సీఎం అన్నారు.
త్వరలో జరుగనున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ ఇంచార్జ్గా జైన్ ఉన్నారని, ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతామన్న భయంతోనే 8 ఏండ్ల నాటి ఓ అబద్ధపు కేసును బీజేపీ ఇప్పుడు తిరగదోడిరదని డిప్యూటీ సీఎం సిసోడియా ఆరోపించారు. జైన్ ఏ తప్పూ చేయలేదని, త్వరలోనే ఆయన బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, జైన్, ఆయన కుటుంబసభ్యులకు చెందిన రూ. 4.81 కోట్ల ఆస్తులను గత నెల ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే.