Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రాజధాని ప్రాంతంలో టిడ్కో ఇళ్లపై నివేదిక ఇవ్వండి

. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
. ఆర్‌-5 జోన్‌పై విచారణ నేటికి వాయిదా

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాజధాని ప్రాంతంలో సుమారు 5వేలకు పైగా నిర్మించిన టిడ్కో ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలు, ఇళ్ల మంజూరుకు అనుసరించిన విధివిధానాలను పూర్తి వివరాలతో అందజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్‌-5 జోన్‌లో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్‌ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈసందర్భంగా రాజధాని పరిధిలో గత ప్రభుత్వం నిర్మించిన 5వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు గత నాలుగేళ్లుగా అందజేయకుండా, కేవలం రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను చెడగొట్టేందుకే పేదల ఇళ్ల పట్టాల పంపిణీ అంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోందని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కట్టిన ఇళ్లను పేదలకు ఇవ్వకుండా, ఇతర ప్రాంతాల్లోని పేదలకు ఇక్కడ స్థలాలు ఇస్తానని అనడంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం, పిటిషనర్లు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని పేర్కొంది. రాజధాని ప్రాంతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల పూర్తి వివరాలు, ఇళ్ల మంజూరుకు అనుసరించిన విధివిధానాలను పూర్తి వివరాలతో అందజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలో 1134 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు (550.65ఎకరాలు), ఎన్టీఆర్‌(583.93 ఎకరాలు) జిల్లా కలెక్టర్లకు భూబదలాయిపు నిమిత్తం సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఈఏడాది మార్చి 31న జీవో 45 జారీచేశారు.
ఆ జీవోను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత రైతులు యు.శివయ్య, కె.రాజేశ్‌, బెజవాడ రమేశ్‌బాబు, ఆలూరి రాజేశ్‌, కుర్రాబ్రహ్మ, కట్టా రాజేంద్రవరప్రసాద్‌ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఆయా పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపడుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img