. రాహుల్ సహా విపక్ష ఎంపీల ప్రమాణం
. సభ్యుల నినాదాలు… అభ్యంతరాలు
. అఖిలేశ్, ఒవైసీ, హేమమాలిని, సుప్రియా సూలే ప్రమాణ స్వీకారం
న్యూదిల్లీ : లోక్సభ తొలి సమావేశాల రెండవ రోజు మంగళవారం కాంగ్రెస్ ఎంపీలు, అనేక మంది ప్రతిపక్ష సభ్యులు భారత రాజ్యాంగ ప్రతులను ప్రదర్శిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ నియామకం తీరుకు వ్యతిరేకంగా విపక్ష కూటమి పార్టీల ఎంపీలంతా రాజ్యాంగ ప్రతులతో సభలో నిరసన తెలుపుతున్నారు. అదేవిధంగా రాజ్యాంగ ప్రతులతోనే ప్రమాణ స్వీకారం చేశారు. పోడియం వద్దకు వెళ్లి ముందుగా తమ చేతిలో ఉన్న రాజ్యాంగ ప్రతిని చూపించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా కూటమి పార్టీల ఎంపీలంతా ఇదే విధానాన్ని అనుసరించారు. మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖుల్లో రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్, మహువా మొయిత్రా, డిరపుల్ యాదవ్, హేమ మాలిని, అసదుద్దీన్ ఒవైసీ, కనిమొళి కరుణానిధి తదితరులు ఉన్నారు. ఇక కొత్తగా ఎన్నికయిన సభ్యుల్లో కేంద్ర మంత్రి, బీజేపీ నేత నారాయణ్ రాణే, ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన సుప్రియా సూలే, శివసేన (యూబీటీ) కి చెందిన అరవింద్ సావంత్, శివసేనకు చెందిన శ్రీకాంత్ షిండే కూడా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, సూలే… ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ పాదాలను తాకి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి కూడా ఆశీర్వాదాలు తీసుకున్నారు. సభ ప్రారంభంలో కొత్తగా ఎన్నికయిన 262 మంది సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారని, మిగిలిన వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రోటెం స్పీకర్ తెలిపారు. మొదటి గంటలో ఎక్కువ మంది సభ్యులు మహారాష్ట్రకు చెందినవారు. వీరు మరాఠీలో ప్రమాణం చేశారు. కొందరు ఇంగ్లీషు, హిందీలో ప్రమాణం చేశారు. మహారాష్ట్రలోని నందుర్బార్ కాంగ్రెస్ సభ్యుడు గోవాల్ కగడ పదవి మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన మొదటి ఎంపీ. ఆయన తర్వాత కాంగ్రెస్కు చెందిన ధూలే ఎంపీ శోభా దినేష్ బచావ్, జల్గావ్ నుంచి బీజేపీకి చెందిన స్మితా ఉదయ్ వాఫ్ు ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయిన వారిలో కేంద్ర మంత్రులు గడ్కరీ, శివరాజ్సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, డీఎంకేకు చెందిన టీఆర్ బాలు, టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా, శిరోమణి అకాలీదళ్కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఉన్నారు. అనేక మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జై హింద్, జై మహారాష్ట్ర, జై భీమ్, జై శివాజీ నినాదాలు చేశారు. స్పీకర్ పదవికి నామినేట్ అయిన బీజేపీ నేత ఓం బిర్లా కూడా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. 17వ లోక్సభలో స్పీకర్గా ఉన్న బిర్లా ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చినప్పుడు కుర్చీలో ఉన్న రాధామోహన్ సింగ్ లేచి నిలబడి ఆయనకు అభివాదం చేశారు. బిర్లా 2014 నుంచి దిగువ సభలో కోట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, కనీసం ఒక్కసారైనా సభ్యులు నిర్దేశించిన ప్రమాణం నుంచి తప్పుకోవద్దని, వారు ఇచ్చిన కాగితంపై రాసిన వాటిని మాత్రమే బిగ్గరగా చదవాలని ప్రొటెం స్పీకర్ గుర్తు చేశారు. ఇదిలాఉండగా, అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత, రాయ్బరేలి ఎంపీ రాహుల్ గాంధీ కూడా ప్రమాణం చేసిన తర్వాత ‘జై హింద్, జై సంవిధాన్’ అన్నారు. ఇన్నర్ మణిపూర్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చా బిమోల్ అకోయిజం మణిపురిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం గాంధీతో కరచాలనం చేశారు. ఔటర్ మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ ఆల్ఫ్రెడ్ ఎస్ ఆర్థర్ పేరును ప్రమాణ స్వీకారానికి పిలిచినప్పుడు రాహుల్ గాంధీ లేచి నిలబడి ఆయనతో కరచాలనం చేశారు. ఆంగ్లంలో ప్రమాణం చేసిన తర్వాత ఆర్థర్, ‘మణిపూర్ మే న్యాయ్ దిలాయే, దేశ్ బచాయియే’ (మణిపూర్లో న్యాయం అందించండి. దేశాన్ని రక్షించండి’ అని అన్నారు. కాంగ్రెస్ సభ్యుల ‘మణిపూర్… మణిపూర్’ నినాదాల మధ్యే ఈ ఇద్దరు ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. ఇక ఒడిశాకు చెందిన మెజారిటీ ఎంపీలు ఒడియాలో ప్రమాణ స్వీకారం చేశారు. మాళవికా దేవి, ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి మాత్రమే తమ ప్రమాణాలను ఇంగ్లీషులో చదివారు. పంజాబ్కు చెందిన ఎంపీలు పంజాబీలో ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, ఆప్లకు చెందిన అనేక మంది రాజ్యాంగ ప్రతులను పట్టుకుని ప్రమాణం చేశారు. భోజన విరామం తర్వాత, తమిళనాడు ఎంపీలు తమ ప్రమాణ స్వీకారాన్ని పునః ప్రారంభించారు. డీఎంకే సభ్యులు తమిళాన్ని ఎంచుకుని రాజ్యాంగానికి విధేయత చూపుతామని ప్రతిజ్ఞ చేశారు.
రాజ్యాంగ ప్రతితో రాహుల్ గాంధీ ప్రమాణం
భారత్ జోడో నినాదాలు, చేతిలో భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగళవారం మధ్యాహ్నం లోక్సభ సభ్యునిగా ప్రమాణం చేశారు. గాంధీ వయనాడ్, రాయ్బరేలీ రెండు స్థానాల నుంచి ఎన్నికయ్యారు. ఇప్పుడు తన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయనున్న వయనాడ్ సీటును ఆయన ఖాళీ చేశారు. ‘నేను, రాహుల్ గాంధీ… ప్రజల సభకు సభ్యునిగా ఎన్నికైనందున చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నేను నిజమైన విశ్వాసం, విధేయతను కలిగి ఉంటానని, నేను భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను సమర్థిస్తానని గంభీరంగా ధ్రువీకరిస్తున్నాను. నేను ప్రవేశించబోతున్న కర్తవ్యాన్ని నిష్ఠతో నిర్వర్తిస్తాను. జై హింద్, జై సంవిధాన్’ అని ప్రమాణ స్వీకారం చేశారు.
‘జై పలస్తీనా’… ‘జై హిందూ రాష్ట్ర’ నినాదాలు
హైదరాబాద్కు చెందిన ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు ప్రార్థన కూడా చదివారు. తర్వాత సంఘర్షణతో దెబ్బతిన్న పశ్చిమాసియా ప్రాంతాన్ని ప్రస్తావించారు. ‘జై పాలస్తీనా’ అని అన్నారు. దీనిపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇది రికార్డుల్లోకి వెళ్లదని ప్రొటెం స్పీకర్ మహతాబ హామీ ఇచ్చారు. తన ప్రమాణ స్వీకారం సందర్భంగా బరేలీకి చెందిన బీజేపీ ఎంపీ చత్రపాల్ సింగ్ గంగ్వార్ ‘జై హిందూ రాష్ట్ర’ అని చెప్పడంతో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష ఎంపీ ప్రేమచంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ‘అతను ఎలా చెప్పగలడు?’ అని ప్రశ్నించారు. ఇది రికార్డుల్లోకి వెళ్లదని సభాపతి హామీ ఇచ్చారు.
నేటికి లోక్సభ వాయిదా
లోక్సభ ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ మాట్లాడుతూ ఎంపీల ప్రమాణాలు, ధ్రువీకరణలు మాత్రమే నమోదవుతాయని, మిగిలిన అన్ని వ్యాఖ్యలు, నిరసనలు, నినాదాలు తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సభా కార్యక్రమాలను బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా కొత్తగా ఎన్నికయిన 262 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశాల సందర్భంగా మొదటి రోజు ఇండియా ఐక్య సంఘటనకు చెందిన విపక్ష ఎంపీలు ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని నినాదాలు చేస్తూ, రాజ్యాంగ ప్రతులను ప్రదర్శిస్తూ పార్లమెంటు సముదాయం లోపల నిరసన ప్రదర్శన నిర్వహించారు.