కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా దశల వారీగా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా థర్డ్వేవ్ అదుపులోకి రావడంతో భారత్ కాస్త ఊరటపొందుతోంది. మరో కొత్త వేరియంట్ పుట్టుకొస్తే రానున్న 6
– 8 నెలల్లో భారత్లో మరో వేవ్ రావొచ్చని ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ రాజీవ్ జయదేవన్ అంచనా వేశారు. ‘కరోనా వైరస్ చాలాకాలంపాటు దశలవారీగా విజృంభిస్తూనే ఉంటుంది. కొత్త వేరియంట్ ఎప్పుడొస్తే అప్పుడే మరో వేవ్ ఉంటుంది. అయితే అది ఎప్పుడో చెప్పలేం. ఇప్పటివరకు జరిగిన పరిణామాలను గమనిస్తే అది 6-8 నెలల్లో కావొచ్చు. కానీ వైరస్ మన చుట్టూనే ఉంటుంది. దాని కట్టడికి మనం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని పేర్కొన్నారు.
ఒమికాన్ బీఏ-2 కేసులు పెరుగుతుండటంతో మరోసారి దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభించే అవకాశాలున్నాయనే వార్తలపైనా ఆయన స్పందిస్తూ, ఒమిక్రాన్ వేరియంట్ సబ్-లీనియేజ్ వేరియంట్ బీఏ-2 అని చెప్పారు. ఇప్పటికే బీఏ-1 సబ్ వేరియంట్ బారిన పడిన వారిపై కూడా బీఏ-2 ప్రభావం ఉండదని తెలిపారు. దీనిపై ఎలాంటి ఆందోళనలు వద్దని చెప్పారు. బీఏ-2 కొత్త వేరియంట్ కానీ స్ట్రెయిన్ కానీ కాదని, ఒమైక్రాన్ సబ్-లీనియేజ్ మాత్రమేనని డాక్టర్ జయదేవన్ స్పష్టం చేశారు. బీఏ-1 కంటే కొంచెం ఎక్కువగా బీఏ-2 వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు. గత రెండేళ్లుగా అది నిలకడగా బలం పుంజుకుంటోందని, అందువల్ల మరికొందరికి ఇన్ఫెక్ట్ కావచ్చని పేర్కొన్నారు. బీఏ-1, బీఏ-2లు రెండు ఇమ్యూన్ ఎస్కేప్ ఎబిలిటీ కలిగి ఉంటాయని, సహజంగానే ఇన్ఫెక్ట్ అయిన వారికి, రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలుంటాయని ఆయన చెప్పారు.