Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాబడిపై దృష్టి

అదనపు ఆదాయాల కోసం అన్వేషణ
ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం
కలెక్టర్‌లకు ముఖ్య బాధ్యతలు
ఆర్థిక వనరులు సమకూర్చే శాఖలతో సీఎం జగన్‌ సమీక్ష

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి:
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కంటే ఖర్చులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆదాయ వనరుల పెంపుపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టి సారించారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చే శాఖలతో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల నుంచి వస్తున్న ఆదాయం, అంతకంటే పెంచుకోవడానికి ఉన్న అవకాశాలను ఆరా తీశారు. కొన్ని శాఖల్లో ఆదాయ లక్ష్యాలు తగ్గడానికి కారణాలను తెలుసుకున్నారు. ఆ లోపాలను సరిచేసుకుని ఆ మేరకు లోటు పూర్తికి చర్యలు తీసుకోవాలని, అలాగే అదనపు ఆదాయాల కోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎస్‌ఓఆర్‌(రాష్ట్రాల సొంత ఆదాయం)ను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో అధ్యయనం చేయాలని సూచించారు. తద్వారా రాష్ట్ర సొంత ఆదాయాలు పెరగడానికి తగిన ఆలోచనలు చేయాలని, వీటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి తక్షణమే దృష్టిపెట్టాలని సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. ఈ అంశాలపై ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకోవడానికి సంబంధిత శాఖలకు చెందిన అధికారులు క్రమం తప్పకుండా సమావేశం కావాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని, పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలన్నారు. రాబడులను పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు కచ్చితమైన ఎస్‌ఓపీలను పాటించాలని స్పష్టం చేశారు. పెండిరగ్‌లో ఉన్న వ్యాట్‌ కేసులను పరిష్కరించడం ద్వారా బకాయిలను రాబట్టుకోవడంపై దృష్టి సారించాలని, గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా వేగవంతం చేయాలని సూచించారు. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్‌ సేవలను సమీక్షించి… తగిన మార్పులు, చేర్పులు చేయాలని వారికి మార్గనిర్దేశనం చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వెలుగుచూసిన అవినీతి ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించకూడదని, ఆ మేరకు పటిష్టమైన ఎస్‌ఓపీలను అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఓటీఎస్‌ పథకం ద్వారా, ఉచిత రిజిస్ట్రేషన్ల రూపేణా పేదలకు ఇప్పటివరకూ రూ.400.55 కోట్ల లబ్ధి చేకూరినట్లు అధికారులు వివరించారు. అలాగే టిడ్కో ఇళ్ల ఉచిత రిజిస్ట్రేషన్ల రూపేణా పేదలకు మరో రూ.1,230 కోట్ల మేర లబ్ధి చేకూరిందని, గతంలో ఎన్నడూకూడా ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో పేదలకు ఇంతటి ప్రయోజనం జరగలేదని అధికారులు వివరించగా, పేదలకు మేలు చేయడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు కె.నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌, బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img