Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రాహుల్‌కు చుక్కెదురు

. పరువు నష్టం కేసులో శిక్ష నిలుపుదలపై పిటిషన్‌ కొట్టివేత
. జాగ్రత్తగా మాట్లాడాల్సిందన్న న్యాయమూర్తి
. పైకోర్టులో సవాల్‌ చేస్తామన్న రాహుల్‌ న్యాయవాది

సూరత్‌ : పరువు నష్టం కేసులో శిక్షపడిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి గుజరాత్‌లోని సూరత్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు పడిన శిక్షను నిలుపుదల చేయాలని ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. రాహుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ సూరత్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి ఆర్పీ మొగేరా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిందని పేర్కొన్నారు. ‘రాహుల్‌ గాంధీ… పార్లమెంట్‌ సభ్యుడు. …అలాగే మోదీపై వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆయన దేశంలోని రెండో అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడు కూడా… ఆ సమయంలో ఆయన జాగ్రత్తగా మాట్లాడాల్సింది. పిటిషనర్‌ చేసిన వ్యాఖ్యలు బాధిత వ్యక్తికి మానసిక వేదనను కలిగించేలా ఉన్నాయి… మోదీ పేరు ఉన్నవారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం వల్ల కచ్చితంగా ఫిర్యాదు దారుడు పూర్ణేశ్‌ మోదీ ప్రతిష్ఠకు భంగం కలిగి ఉండవచ్చు. అలాగే ఆయనకు మానసిక వేదనకు కారణం కావొచ్చు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా సెషన్స్‌ కోర్టు ఉత్తర్వులను గుజరాత్‌ హైకోర్టులో సవాల్‌ చేస్తామని రాహుల్‌ తరపు న్యాయవాది కిరిత్‌ పన్వాలా తెలిపారు. అలాగే దిగువ కోర్టు మార్చి23న ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన అప్పీల్‌పై మే20వ తేదీన విచారణ చేపట్టాలని కూడా సెషన్స్‌కోర్టు నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. కాగా సూరత్‌ సెషన్స్‌ కోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. చట్ట ప్రకారం తమకున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. అయితే సూరత్‌ కోర్టు నిర్ణయాన్ని స్వాగతించిన బీజేపీ… రాహుల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడం… న్యాయ వ్యవస్థతో పాటు ప్రజలు సాధించిన విజయమని చెప్పుకొచ్చింది. గాంధీ కుటుంబం, రాహుల్‌ గాంధీ అహంకారానికి ఈ నిర్ణయం చెంపపెట్టు అని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్‌ పాత్ర వ్యాఖ్యానించారు. చట్టం అందరికీ సమానమేనని ఇప్పుడు నిరూపితమైందన్నారు. రాహుల్‌ తనను తాను చట్టానికి అతీతులుగా ఎందుకు భావిస్తున్నారని కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ ప్రశ్నిం చారు. ఆయన్ను ప్రత్యేకంగా పరిగణిం చాలన్న కాంగ్రెస్‌ నాయకుల డిమాండ్లపై తీవ్రంగా మండిపడ్డారు.
వాదనలు ఇలా…
రాహుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సూరత్‌ సెషన్స్‌ కోర్టు.. ఏప్రిల్‌ 13న రెండు పక్షాల వాదనలు విన్నది. ఆ సమయంలో రాహుల్‌ తరపున వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వొకేట్‌ ఆర్‌ఎస్‌ చీమా.. మోదీ అనేది కులం పేరు కాదని అన్నారు. రాహుల్‌కు శిక్ష విధించిన జడ్జిని ఎవరో తప్పుదోవ పట్టిం చారని చెప్పారు. జడ్జి కఠిన పదాలు ఉపయోగించడం సరికాదని వాదించారు. ‘రాహుల్‌కు విధించిన శిక్షలో ఒక్కరోజు తగ్గినా… అనర్హత వేటు పడదని కోర్టుకు తెలుసు. ఆయన్ను దోషిగా తేల్చి అరగంట వ్యవధిలో అత్యంత కఠిన శిక్ష విధించారు. సుప్రీంకోర్టు రాహుల్‌ను హెచ్చరించిందని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు హెచ్చరికలను సైతం పట్టించుకోలేదని కఠిన వ్యాఖ్యలు చేసింది. కానీ, ఆయన ప్రసంగం… సుప్రీంకోర్టు హెచ్చరికల కన్నా ముందే జరిగింది’ అని రాహుల్‌ తరపు న్యాయవాది తెలిపారు. అంతకుముందు ఏప్రిల్‌ 3న నేరపూరిత పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు విధించిన శిక్షను సవాల్‌ చేస్తూ సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు రాహుల్‌. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం… ఏప్రిల్‌ 13 వరకు రాహుల్కు బెయిల్‌ను పొడిగించింది. సూరత్‌ చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రే ట్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాహుల్‌ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. తనను దోషిగా తేల్చడంపై స్టే విధించాలని, జైలు శిక్షను సస్పెం డ్‌ చేయాలని ఈ రెండు పిటిషన్లలో కోరారు. అయితే అవతలి పక్షం వాదనలు వినకుండా
అలాంటి ఆదేశాలు ఇవ్వడం వీలుకాదని కోర్టు వెల్లడిరచింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో మోదీ ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ కోర్టును ఆశ్రయించారు. మోదీ పేరు ఉన్నవారిని కించపరిచేలా వ్యా ఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ జరిపిన సూరత్‌ ట్రయల్‌ కోర్టు రాహుల్‌ గాంధీని దోషిగా తేలుస్తూ… రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పై కోర్టుల్లో అప్పీల్‌ చేసుకునేం దుకు వీలుగా శిక్ష అమలును 30 రోజుల పాటు వాయిదా వేసింది. అనంతరం రాహుల్‌ గాంధీకి బెయిల్‌ మంజూరు చేసింది. కాగా రెండేళ్లకు పైగా శిక్ష పడిన నేపథ్యం లో నిబంధనల ప్రకారం రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దయినట్లు లోక్‌సభ సెక్రెటేరియట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆయనకు కేటాయించిన బంగ్లాను సైతం ఖాళీ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఇటీవలే రాహుల్‌… తన బంగ్లాను ఖాళీ కూడా చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img