సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూదిల్లీ : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన గుజరాత్ జడ్జి సహా 68 మందికి పదోన్నతి కల్పించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను మే 8న విచారించనుంది రాహుల్గాంధీని పరువునష్టం కేసులో దోషిగా నిర్ధారించిన గుజరాత్ న్యాయమూర్తి హరీశ్ హస్ముఖ్ భాయ్ వర్మ సహా 68 మంది జ్యుడిషియల్ అధికారులకు పదోన్నతి కల్పించడాన్ని సవాలు చేస్తూ పిటిషనర్లు పిల్ దాఖలు చేశారు. ఈ 68 మంది న్యాయమూర్తులు 65 శాతం కోటా విధానం ఆధారంగా పదోన్నతి పొందారు. ఈ పదోన్నతిని సీనియర్ సివిల్ జడ్జి కేడర్కు చెందిన ఇద్దరు జ్యుడీషియల్ అధికారులు రవికుమార్ మెహతా, సచిన్ ప్రతాప్రాయ్ మెహతా సవాలు చేశారు. మార్చి 10న గుజరాత్ హైకోర్టు జారీ చేసిన పదోన్నతుల జాబితాను రద్దు చేయాలని పిటిషన్లో డిమాండ్ చేశారు. జ్యుడీషియల్ అధికారుల నియామకానికి గుజరాత్ హైకోర్టు మెరిట్, సీనియారిటీ కొత్త జాబితాను విడుదల చేయాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. జడ్జి హరీశ్ హస్ముఖ్ భాయ్ వర్మను సూరత్ జిల్లా సెషన్స్ కోర్టులో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్గా నియమించారు. 43 ఏళ్ల జస్టిస్ వర్మకు న్యాయాధికారిగా పదేళ్ల అనుభవం ఉంది. ఆయన వడోదర నివాసి. జస్టిస్ వర్మ మహారాజా సాయాజీ రావు విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం అభ్యసించారు.ఎల్ఎల్బీ పూర్తి చేసిన తర్వాత జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షకు హాజరై 2008లో జ్యుడీషియల్ ఆఫీసర్గా నియమితులయ్యారు.