99 కోట్లు దాటిన కరోనా టీకాల పంపిణీ
న్యూదిల్లీ : కరోనా మహమ్మారిని కట్టడి చేసే వాక్సినేషన్ కార్యక్రమంలో అరుదైన రికార్డుకు భారత్ మరో అడుగు దూరంలో ఉంది. దేశంలో ఇప్పటివరకు 99కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడిరచింది. ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ట్విటర్లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘99 కోట్లు దాటాం. టీకా పంపిణీలో 100కోట్ల డోసుల మైలురాయి దిశగా భారత్ వేగంగా కదులుతోంది’ అని మంత్రి ట్వీట్ చేశారు. కరోనా వైరస్ను అరికట్టేందుకు బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 16న ప్రారంభించింది. తొలినాళ్లలో డోసుల కొరత, ఇతరత్రా కారణాల వల్ల నెమ్మదిగా సాగిన వాక్సినేషన్.. కరోనా రెండో దశ నుంచి ఊపందుకుంది. సెప్టెంబరు 17న మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక్క రోజులోనే 2.5కోట్ల మందికి టీకాలు వేసి అరుదైన రికార్డు సృష్టించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ 99 కోట్లు దాటగా..బుధవారానికి 100కోట్ల మైలురాయికి చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే చైనా తర్వాత 100కోట్ల డోసులు పంపిణీ చేసిన రెండో దేశంగా భారత్ అరుదైన గుర్తింపు సాధించనుంది. కాగా, టీకా పంపిణీలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 12కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు. ఆ తర్వాత 9.21కోట్ల డోసుల పంపిణీతో మహారాష్ట్ర రెండోస్థానంలో నిలిచింది. పశ్చిమబెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్లలోనూ 6 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు.