పూర్తిగా రద్దు కాదు
సెప్టెంబరు 30 లోగా మార్చుకోవాలి
ఆర్బీఐ కీలక నిర్ణయం
ముంబై: రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో చలామణీలో ఉన్న నోట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. అయితే, ఈ నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని, ఇప్పటికీ లావాదేవీలకు ఈ నోట్లను వినియోగించుకోవచ్చని తెలిపింది. రూ.2వేల నోట్లు ఉన్నవారు మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ వివరించింది. ఒక విడతలో గరిష్ఠంగా రూ.20 వేల వరకు మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. డిపాజిట్ విషయంలో మాత్రం ఎలాంటి నిబంధనలు విధించలేదు. బ్యాంకు రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా నోట్ల మార్పిడి ప్రక్రియ చేపట్టాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ రూ.2వేల నోట్లు మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఆర్బీఐ ప్రకటన ప్రకారం 2016 నవంబర్లో రూ.1000, రూ.500 నోట్ల రద్దు నేపథ్యంలో నగదు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూ.2వేల నోట్లను తీసుకొచ్చింది. 2018-19లోనే ఈ నోట్ల ప్రింటింగ్ను నిలిపివేసినట్లు తెలిపింది. 2017 మార్చి నాటికి చలామణీలో ఉన్న నగదు మొత్తంలో రూ.2వేల నోట్ల వాటా 89 శాతంగా ఉంది. 2018 మార్చి 31 నాటికి రూ.6.73 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. 2023 మార్చి నాటికి ఆ విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది. అంటే చలామణీలో ఉన్న మొత్తం నగదులో రూ.2వేల నోట్ల వాటా 10.8 శాతానికి చేరిందని ఆర్బీఐ తెలిపింది. ‘క్లీన్ నోట్ పాలసీలో భాగంగా తాజాగా రూ.2వేల నోట్ల చలామణీని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే, రూ.2వేలు నోటు అనేది ప్రస్తుతం లావాదేవీలకు వినియోగించుకోవచ్చని (లీగల్ టెండర్) స్పష్టం చేసింది. 2013-14లోనూ ఇదే తరహాలో సర్క్యులేషన్లో ఉన్న నోట్లను వెనక్కి తీసుకున్నామని ఆర్బీఐ గుర్తుచేసింది. రూ.2 వేల నోట్లను ప్రజలు బ్యాంకుల ద్వారా మార్పిడి చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఏదైనా బ్యాంక్ శాఖ నుంచి మే 23 నుంచి సెప్టెంబరు 30 లోగా రూ.2వేల నోట్లను మార్పిడి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అన్ని బ్యాంకులూ రూ.2వేల నోట్ల జారీని నిలిపివేయాలని, ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.