హిమాచల్ప్రదేశ్లో ప్రధాని వ్యాఖ్యలు
మండీ(హిమాచల్ప్రదేశ్) : రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రెండిరజన్ల ప్రభుత్వం వల్ల అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతమవుతాయని, అనేక పథకాల అమలుకు ఢోకా ఉండదని తెలిపారు. రాష్ట్రంలో నాలుగేళ్ల బీజేపీ ప్రభుత్వ వార్షికోత్సవంలో ప్రధాని ప్రసంగించారు. రాష్ట్రంలోని మండీలో గల పద్దాల్ మైదానంలో సోమవారం బహిరంగ సభ జరిగింది. ‘కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్భారత్ పథకం ప్రారంభించింది. హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం ఇదే తరహా పథకం హిమ్కేర్ను చేపట్టింది. ఈ పథకాల కింద రాష్ట్రానికి చెందిన 1.25 లక్షలమందికి ఉచిత వైద్య సేవలు అందించాం. ప్రజలు ఆనందంగా జీవించడం మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. ఇందులో విద్యుత్ కీలక పాత్ర పోషిస్తోంది’ అని మోదీ చెప్పారు. మరింత విద్యుత్ ఉత్పత్తి కోసం మోదీ విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించారు. థాకూర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అత్యంత శీతల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ నాలుగేళ్ల థాకూర్ ప్రభుత్వం సాధించిన విజయాలతో సంతృప్తి చెందిన ప్రజలు భారీగా సభకు తరలివచ్చారని మోదీ చెప్పారు. దీనికిముందు రాష్ట్రంలో రూ.11,581 కోట్ల అభివృద్థి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. రూ.28,197 కోట్ల విలువైన 287 ప్రాజెక్టులను ప్రారంభించారు. అభివృద్ధి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు.