విజయవాడ పోలీసుల బాధ్యతారాహిత్యం
బంగారం వ్యాపారి బాధలు వర్ణనాతీతం
విశాలాంధ్ర-విజయవాడ క్రైమ్: ‘బంగారం పోయిందా.. అయితే రేపు రండి… ఎల్లుండి రండి… మీరు ఇలా రోజూ వచ్చినా ఉపయోగం లేదు. మాకు సీఎం ప్రోగ్రాం ఉంది… బందోబస్తు విధులు ఉన్నాయి… ఇప్పట్లో మేం వచ్చి వెతికే పరిస్థితి లేదు. కాబట్టి మీరే వెళ్లి దొంగ ఎక్కడ ఉన్నాడో చూసి వచ్చి చెప్పండి… ఆ తర్వాత మేం వచ్చి పట్టుకుంటాం’ అని విజయవాడ నగర పోలీసులు ఓ బంగారం వ్యాపారికి చెబుతున్న మాటలు. పోలీసుల మాటలు నమ్మిన ఆ వ్యాపారి… దొంగను వెతుక్కుంటూ పశ్చిమ బెంగాల్ వెళ్లగా… ఇక్కడ షాపులో ఉన్న మరో యువకుడు 40 గ్రాముల బంగారం అపహరించి అక్కడి నుంచి ఉడాయించాడు. అయినా పోలీసుల్లో కదలిక లేదు. నాలుగు నెలలుగా ఆ వ్యాపారిని పోలీస్స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. విజయవాడ గవర్నర్పేటలోని మహేంద్ర కాంప్లెక్స్లో వన్టౌన్కు చెందిన ఓ వ్యక్తి బంగారు ఆభరణాల తయారీ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ షాపులో పశ్చిమ బెంగాల్లోని కోలాఘాట్కు చెందిన రాణా అరుణ్, బబ్లూ అనే యువకులు పనిచేస్తున్నారు. రాణా అరుణ్ జనవరి 17వ తేదీన షాపులోని 60 గ్రాముల బంగారంతో ఉడాయించాడు. వెంటనే ఆ వ్యాపారి సమీప పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు…బాధితుడు చెప్పిన వివరాలన్నీ విన్నారు. వారం రోజులు స్టేషన్ చుట్టూ తిప్పుకున్నారు. చివరికి ‘మేం బాగా బిజీగా ఉన్నాం. పశ్చిమ బెంగాల్ వచ్చి వెదకలేం. ముందు మీరు వెళ్లి దొంగ ఎక్కడ ఉన్నాడో గుర్తించి మాకు సమాచారం ఇవ్వండి. వచ్చి పట్టుకొస్తాం’ అని చెప్పారు.
దీంతో జనవరి 30న బాధితుడు పశ్చిమ బెంగాల్ వెళ్లి అక్కడ తెలిసినవారి సహకారంతో దొంగను చూశాడు. దొంగ ఇంటిని గుర్తించి సీఐకి పదిసార్లు ఫోన్ చేశారు. అయినా సీఐ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో బాధితుడు రెండు రోజులు అక్కడే ఉండి తిరిగి విజయవాడ వచ్చేశాడు. ఆ వ్యాపారి షాపుకు వెళ్లి చూడగా మరో యువకుడు బబ్లూ 40 గ్రాముల బంగారంతో పరారయ్యాడు. దీంతో కంగుతిన్న వ్యాపారి వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి మళ్లీ ఫిర్యాదు చేశాడు. మొదటి కేసు తేలాక రెండో ఫిర్యాదు సంగతి చూద్దామని పోలీసులు చెప్పారు.
పోలీసులకు భంగపాటు
బాధితుడు పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతుండటంతో చివరికి ఇద్దరు పోలీసులు ఫిబ్రవరి 26న కోల్కతా వెళ్లారు. నిందితులను పట్టుకునేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసుల సహకారం కోరారు. అయితే, ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడి స్టేషన్లో ఉంచి బాగా పొద్దుపోయిన తర్వాత దొంగ ఇంటి వద్దకు తీసుకువెళ్లారు. విజయవాడ పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న దొంగ రాణా అరుణ్ పారిపోయాడు. రెండో దొంగ బబ్లూ అక్కడ కనిపించాడు. కనీసం బబ్లూను అయినా పట్టుకుని తీసుకొద్దామని జీపు ఎక్కించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అనూహ్యంగా గ్రామస్తులు సినీఫక్కీలో పోలీసులపై తిరగబడ్డారు. ఎఫ్ఐఆర్ కాపీ చూపించి తీసుకువెళ్లాలని పట్టుపట్టారు. దీంతో ఒక ఎఫ్ఐఆర్తో వెళ్లిన పోలీసులు చేసేదేమీ లేక తిరిగి వచ్చేశారు. విజయవాడ వచ్చిన తర్వాత మొదటి ఎఫ్ఐఆర్లోనే రెండో దొంగ పేరు చేర్చి చేతులు దులిపేసుకున్నారు. కాగా, బెంగాల్ నుంచి తిరిగి వచ్చిన పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బాధితుడు మాత్రం పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఎస్ఐని కలిస్తే సీఐ వద్దకు పంపిస్తున్నారు. సీఐని కలిస్తే రైటర్ వద్దకు పంపిస్తున్నారు. ఇంతకుమించి ఈ కేసుల్లో ఎటువంటి పురోగతి లేకపోవడం విశేషం.