Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

రైతుకు ముందే దీపావళి

మూడు పథకాలు ఒకేసారి అమలు
50 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బు జమ
అన్నదాత ముఖంలో చిరునవ్వే లక్ష్యం : సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రైతులకు దీపావళి ముందే వచ్చేసింది. వైఎస్సార్‌ రైతుభరోసా, వైఎస్సార్‌ సున్నావడ్డీ, వైఎస్సార్‌ యంత్ర సేవాపథకాలకు సంబంధించి ఒకేసారి రూ.2,190 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు. రైతుల కళ్లల్లో దీపావళి ముందే చూడాలన్న ఆశతోనే ఈ మూడు పథకాలకు సంబంధించిన సొమ్ము ఒకేసారి రైతుల ఖాతాల్లో వేశామని సీఎం ఈసందర్భంగా చెప్పారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్నామని, దానికోసం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా లెక్కచేయకుండా ముందుగా చెప్పిన ప్రకారం నిధులు విడుదల చేస్తున్నామన్నారు. ప్రజల్లో తమ ప్రభుత్వం పట్ల ఉన్న విశ్వసనీయతను కాపాడుకునేందుకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేస్తున్నామన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు. రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.18,777 కోట్లు విడుదల చేసినట్లు సీఎం వెల్లడిరచారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు కూడా రూ.1,180 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించినట్లు గుర్తు చేశారు. కరోనా సవాల్‌ విసిరినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గత 29 నెలల పాలనలో అనేక మార్పు లు తీసుకొచ్చామని, ముఖ్యంగా వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేయడం, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, ఈ-క్రాపింగ్‌ నమోదు ద్వారా వ్యవసాయ పథకాలు అమలు వంటివి అనేకం చేశామని వివరిం చారు. ఈ ఏడాది లబ్ధిపొందుతున్న రైతు కుటుంబాల్లో 48,86, 361 మంది భూ యజమానులు కాగా, అటవీభూములు సాగుచేస్తున్న వారు 82,251 మందితోపాటు, భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాస్తవ సాగు(కౌలు)దారులు 68,737 మంది కూడా ఈపథకం ద్వారా లబ్ధిపొం దుతున్నట్లు చెప్పారు. అలాగే 6.67 లక్షల మంది రైతులకు వైఎస్సార్‌ సున్నావడ్డీ రాయితీ పథకం కింద రూ.112.70 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ఖరీఫ్‌-2020 సీజన్‌కు సంబంధించి ఈ-క్రాప్‌లో నమోదైన పంట వివరాల ఆధారంగా, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం వడ్డీ రాయితీ లబ్ధిని వాస్తవ సాగుదారులకు అందించాలని సంకల్పించి, ఈ సీజన్‌లో రూ.లక్షలోపు 11,03,228 మందికి రూ.6,389 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. ఇక చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు అమలు చేస్తున్న వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ద్వారా సబ్సిడీ సొమ్ము రూ.25.55 కోట్లు రైతు గ్రూపులకు జమ చేసినట్లు చెప్పారు. ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పాముల పుష్పశ్రీవాణి, వ్యవసాయ, సహాకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం వి యస్‌ నాగిరెడ్డి, వ్యవసా యశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img