లఖింపూర్ ఖేరీ ఘటనపై వరుణ్ గాంధీ వ్యాఖ్యలు
యూపీలోని లఖీంపూర్ ఖేరీలో రైతులను వాహనంతో తొక్కించిన ఘటనపై విపక్షాల నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. ఈ ఘటనకు సంబంధించి అనేక వీడియోలు బయటకు రాగా తాజాగా స్పష్టమైన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందులో వెనుక వేగంగా వచ్చిన థార్ వాహనం రైతులను తొక్కుకుంటూ వెళ్లగా.. ఆ వెంటే మరో ఎస్యూవీ వేగంగా వెళ్లింది.ఈ ఘటనతో బిత్తరపోయిన రైతులు భయాందోళనలకు గురై అటూఇటూ పరుగెత్తడం కనిపించింది. బీజేపీ పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీ సైతం గురువారం ఉదయం ఈ వీడియోను ట్వీట్ చేశారు. ‘‘ఈ వీడియో స్పష్టంగా ఉంది. రైతులను హతమార్చడం ద్వారా వారి నోరు మూయించలేం..చిందిన రైతుల అమాయక రక్తానికి జవాబుదారీతనం ఉండాలి, రైతులకు న్యాయం జరగాలి.’’ అంటూ వరుణ్ వీడియోను షేర్ చేస్తూ వ్యాఖ్యానించారు.రెండురోజుల క్రితం కూడా ఆయన ఇదే తరహా వీడియోను ట్వీట్ చేస్తూ, ఈ దృశ్యాలు ఎవరి ఆత్మనైనా కదిలిస్తాయని పేర్కొన్నారు. ఈ వీడియోను పోలీసులు గమనించాలి, ఈ వాహనాల యజమానులను గుర్తించాలి, ఈ ఘటనలో పాల్గొన్న ఇతరులను గుర్తించి వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండు చేశారు.