చెన్నై: రైల్వేను ప్రైవేటీకరించడం లేదని ఆ శాఖమంత్రి అశ్వనీ వైష్ణవ్ శనివారం చెప్పారు. ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంచేశారు. ప్రత్యేకించి భద్రత, సదుపాయాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ భాగస్వామ్యం వంటి స్వదేశీ సంస్థలను ఉపయోగించుకొని సాంకేతికత పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. పెరంబూర్లోని రైలు మండపంలో శనివారం జరిగిన భారతీయ రైల్వే మజ్దూర్ సంఫ్ు 20వ మహాసభల్లో మంత్రి వైష్ణవ్ వర్చువల్ విధానంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా కింద పెరంబూరులోని ఐసీఎఫ్ ద్వారానే వందే భారత్ ఎక్స్ప్రెస్కు రూపకల్పన చేసినట్లు మంత్రి తెలిపారు. ‘రైల్వేను ప్రైవేటీకరిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీలు పదేపదే ఆరోపిస్తున్నాయి. రైల్వే అనేది ఓ పెద్ద సంక్లిష్ట సంస్థ. రైల్వేను ప్రైవేటీకరించే విధానం ఏదీ కేంద్రం వద్ద లేదు. అలాంటి ఆలోచనలే లేవు’ అని చెప్పుకొచ్చారు. రైల్వేను ఎలా మెరుగుపర్చడం, ఏవిధంగా ముందుకు తీసుకెళ్లడం అనే అంశాలపైనే చర్చిస్తున్నామని తెలిపారు. రైల్వే ప్రైవేటీకరణ కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికంగా ఉపయోగించుకోవడంపై దృష్టి పెట్టామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం ఇదే విషయం ఇప్పటికే స్పష్టం చేశారన్నారు.