న్యూదిల్లీ: బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ సొంతపార్టీపై విమర్శల వర్షం కురిపించారు. అన్నదాతల విషయంలో మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా ఖండిరచారు. వరుణ్గాంధీ చాలాకాలంగా బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఏబీజీ షిప్యార్డ్ బ్యాంకులను మోసగించడంపై వరుణ్గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆర్థిక నేరాలకు పాల్పడి…విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్మాల్యా, నీరవ్ మోదీ తదితరుల పేర్లు ప్రస్తావించి..కేంద్రంపై ఆరోపణలు గుప్పించారు. విజయ్ మాల్యా రూ.9 వేల కోట్లు, నీరవ్మోదీ రూ.14 కోట్లు, రిషీ అగర్వాల్ రూ.23 వేల కోట్ల బ్యాంకు మోసాలకు పాల్పడ్డారని వరుణ్గాంధీ తెలిపారు. అయితే, ఇప్పుడు దేశంలో రోజుకు 14 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే..ఆ ధనవంతులు మాత్రం విలాసవంత జీవితం గడుపుతున్నారని ఆరోపించారు. ఈ భారీ అవినీతిపై పటిష్టవంతమైన ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారని పేర్కొంటూ మోదీ సర్కారు చర్యల్లో లోపాలను ప్రస్తావించారు. దర్యాప్తు సంస్థలు ఆర్థిక నేరాలను వెలికితీసిన తర్వాతే నీరవ్ మోదీ, విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయారని గుర్తుచేశారు. తాజాగా గుజరాత్కు చెందిన ఏబీజీ షిప్యార్డ్ సంస్థ 28 బ్యాంకులను మోసం చేసి…సుమారు రూ.23 వేల కోట్ల మేరకు టోకరా పెట్టింది. నిందితులు దేశం విడిచి పారిపోకుండా దర్యాప్తు సంస్థలు లుక్అవుట్ నోటీసులు జారీ చేశాయి.