మరోమార్గం లేక ఉద్యోగాల్లో కోత విధింపు
ఉద్యోగం కోల్పోయిన వాళ్లను ఆదుకుంటామని వెల్లడి
ట్విటర్ను హస్తగతం చేసుకున్న వారానికే కంపెనీలో దాదాపు 50 శాతం ఉద్యోగులను ఎలాన్మస్క్ విధుల నుంచి తొలగించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రావడంతో మస్క్ స్పందించారు. మరో అవకాశం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ట్విటర్ రోజూ 40 లక్షల డాలర్లు నష్టపోతోందని వెల్లడిరచారు. నష్టాలను తగ్గించుకోవడం, కంపెనీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడం కోసమే ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని ట్వీట్ చేశారు.తొలగించిన ఉద్యోగులకు ట్విటర్ అండగా ఉంటుందని మస్క్ చెప్పారు. మూడు నెలల పాటు వారికి 50 శాతం కంటే ఎక్కువే జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ట్విటర్ కొనుగోలుకు మస్క్ సుమారు 44 బిలియన్ డాలర్లు వెచ్చించారు. కంపెనీ తన చేతుల్లోకి వచ్చిన వారంలోపే ఉద్యోగాలలో కోత మొదలు పెట్టారు. పొదుపు చర్యల్లో భాగంగా ట్విటర్ లో టాప్ ఎగ్జిక్యూటివ్ ల నుంచి సాధారణ ఉద్యోగుల దాకా చాలామందిని ఇంటికి పంపించారు.