Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

లఖింపూర్‌పై రైతాగ్రహం

సుప్రీం జోక్యంతో మారిన సీన్‌
విచారణకు హాజరైన ఆశిష్‌ మిశ్రా
అరెస్టుకు అన్నదాతల డిమాండు
మౌనధర్నా విరమించిన సిద్ధూ
రేపు షహీద్‌ కిసాన్‌ యాత్ర
12న సంస్మరణ సభలు బ 18న రైల్‌రోకో
26న లక్నో మహాపంచాయత్‌ : ఎస్‌కేఎం పిలుపు
ఇది ఉగ్రదాడన్న రైతు నేతలు
అండగా నిలుస్తున్న విపక్షాలు

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరిలో రైతులపై హత్యాకాండ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై రైతాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అన్నదాతలను వాహనం కింద తొక్కించి చంపించిన కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌పై చర్యలకు కిసాన్‌ సంఘాలు డిమాండు చేస్తున్నాయి. తండ్రీకొడుకులను తక్షణమే అరెస్టు చేయాలని, అజయ్‌మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించాలని పట్టుబట్టాయి. లఖింపూర్‌ హింసపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేయడంతో సీన్‌ మారిపోయింది. విచారణకు హాజరు కావాలన్న ఆదేశాలను బేఖాతరు చేసిన ఆశిష్‌ శనివారం సిట్‌ ముందుకు వచ్చారు. దీంతో మౌనధర్నాను కాంగ్రెస్‌ నేత సిద్ధూ విరమించారు. మరణించిన రైతు కుటుంబాలకు న్యాయం కోసం 11న షహీద్‌ కిసాన్‌ యాత్ర, 12న సంస్మరణ సభలు, 18న రైల్‌రోకోలు, 16న మహాపంచాయత్‌కు సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. రైతులపై ముందస్తు ప్రణాళికగా దాడి జరిగిందని మండిపడిరది.

లఖింపూర్‌ ఖేరి / న్యూదిల్లీ / ముంబై : కొత్త సాగు చట్టాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశీష్‌ మిశ్రా వాహన శ్రేణి దూసుకెళ్లడం, నలుగురు రైతులు, జర్నలిస్టు చనిపోవడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. రైతులను వాహనంతో తొక్కించడాన్ని యావత్‌ దేశం ముక్తకంఠంతో ఖండిరచింది. ఇది ఆశీష్‌ మిశ్రా పనేనని, అతనిని వెంటనే అరెస్టు చేయాలని, అతని తండ్రి, కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాను బర్తరఫ్‌ చేయాలని రైతాంగం ముక్తకంఠంతో డిమాండు చేసింది. అక్టోబరు 3న జరిగిన హింసలో చనిపోయిన జర్నలిస్టు ఇంటి ఎదుట మౌనధర్నాను కాంగ్రెస్‌ పంజాబ్‌ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ చేపట్టారు. ఆశీష్‌ మిశ్రాపై చర్యలకు డిమాండు చేశారు. సిట్‌ విచారణకు హాజరు కావాలని తొలుత జారీ అయిన ఉత్తర్వులను ఆశీష్‌ బేఖాతరు చేయగా మరోమారు సమన్లు జారీ అయ్యాయి. దీంతో ఆయన శనివారం ఉదయం 11 గంటలకు సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. క్రైంబ్రాంచ్‌ డీఐజీ (హెడ్‌క్వార్టర్స్‌) ఉపేంద్ర అగర్వాల్‌ నేతృత్వ సిట్‌ బృందం ఆశీష్‌ను విచారించింది. ఈలోగా అదనపు భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనశ్రేణిలో ఆశీష్‌ ఉన్నట్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. ఈ ఆరోపణలను ఆశీష్‌, అజయ్‌ మిశ్రా తోసిపుచ్చారు. ఆశీష్‌ అసలు అక్కడ లేరని నిరూపించేందుకు తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. ఇదిలావుంటే, సుప్రీంకోర్టు స్వయంగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో సీన్‌ మారింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపైనా, డీజీపీ తీరుపైనా సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ కేసులో ఆశీష్‌మిశ్రాను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌ సక్రమంగా నమోదు కాలేదని తమ దృష్టికి వచ్చినట్లు మండిపడిరది. తగు చర్యలు తీసుకోవాలని యూపీ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఆశీష్‌ విచారణకు హాజరు కావడం… బాధిత రైతు కుటుంబాల విజయమని కాంగ్రెస్‌ నేత సిద్ధూ అన్నారు. ఇక చట్టం తన పని తాను చేసుకుపోతుందని, న్యాయం జరుగుతుందన్నారు. అజయ్‌ మిశ్రాను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని, సామరస్యానికి భంగం కలిగించడం, హత్యకు కుట్ర, నిందితులను కాపాడే యత్నం ఆరోపణల కింద అరెస్టు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నేత యోగేంద్ర యాదవ్‌ డిమాండు చేశారు. ఆయన దిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ అజయ్‌ మిశ్రా బర్తరఫ్‌కు డిమాండు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌…ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తంచేశారు.
లఖింపూర్‌ దోషులను అరెస్టు చేయకుండా వారికి పుష్పగుచ్ఛాలు ఇస్తున్నారంటూ దుయ్యబట్టారు. రైతులను తొక్కించినట్లే.. చట్టాలను తొక్కేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇవి నామమాత్రమపు సమన్లు.. వాస్తవానికి వారికి సమ్మాన్‌ (గౌరవం) ఇస్తున్నారని లక్నోలో విలేకరులతో మాట్లాడిన అఖిలేశ్‌ అన్నారు. లఖింపూర్‌ ఖేరి మృతుల సంస్మరణ సభలు ఈనెల 12న తికోనియాలో జరుగుతాయని యోగేంద్ర యాదవ్‌ తెలిపారు. ఆ రోజున అన్ని రైతు సంఘాలు ప్రార్థనా సమావేశాలు నిర్వహించాలని, ప్రజలంతా సాయంత్రం తమ ఇళ్లల్లో కొవ్వొత్తులు వెలిగించాలని పిలుపునిచ్చారు. 11వ తేదీలోగా డిమాండ్లు పరిష్కరించకపోతే చనిపోయిన రైతుల అస్థికలతో లఖింపూర్‌ ఖేరి నుంచి ‘షహీద్‌ కిసాన్‌ యాత్ర’ నిర్వహిస్తామని వెల్లడిరచారు. ఈనెల 18న ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా రైల్‌లోకో, 26న లక్నోలో మహాపంచాయత్‌ చేపడదామని ఎస్‌కేఎం పిలుపునిచ్చింది. 15వ తేదీన దసరా సందర్భంగా ప్రధాని, హోంమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేస్తామని యాదవ్‌ తెలిపారు. ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ (ఐవైసీ) సభ్యులు దేశ రాజధానిలో ఆందోళన చేపట్టారు. ఐవైసీ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌ బీవీ నేతృత్వంలో సునెహరీ బాగ్‌ రోడ్‌ నుంచి కృష్ణమీనన్‌ మార్గ్‌లోని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇంటి వరకు మార్చ్‌ నిర్వహించారు. పోలీసులు అడ్డుకొని ఆందోళన స్థలిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. లఖింపూర్‌ ఖేరి హింసాకాండ ఉగ్రదాడితో సమానమని, అజయ్‌ మిశ్రా, ఆశీష్‌ను వెంటనే అరెస్టు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా డిమాండు చేసింది. ప్రణాళికాబద్ధంగా రైతులపై దాడి జరిగిందని దుయ్యబట్టింది. నిరసన తెలిపే రైతులపై హింసామార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుందని రైతు నేత జోగిందర్‌ సింగ్‌ ఉగ్రాహన్‌ ఆరోపించారు. తాము హింసామార్గాన్ని అనుసరించబోమన్నారు.
రేపటి మహా బంద్‌కు శివసేన మద్దతు : లఖింపూర్‌ ఖేరి హింసాకాండకు నిరసనగా ఈనెల 11న మహారాష్ట్రలో నిర్వహించే బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మలిక్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి సచిన్‌ సావంత్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ప్రజలను మేల్కొల్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పోరాటంలో రైతులు ఒంటరిగా లేరని, ముందు నుంచే మహారాష్ట్ర వారికి అండగా ఉందని రౌత్‌ నొక్కిచెప్పారు.ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో కలిసి ఉమ్మడి విపక్ష వ్యూహంపై చర్చించానన్నారు. రైతులకు సంఫీుభావం తెలిపే విషయంలో మిగతా రాష్ట్రాలు మహారాష్ట్రను అనుసరించాలని రౌత్‌ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img