ఒకరి నుంచి 18 మందికి వ్యాప్తి..లక్షణాలివే…
చైనాలో కరోనా విలయానికి కారణంగా భావిస్తున్న బీఎఫ్.7 రకానికి చెందిన ఒమిక్రాన్ వైరస్ భారత్లోకి కూడా ప్రవేశించింది. దేశవ్యాప్తంగా ఈ రకానికి చెందిన కేసులు నాలుగు నమోదయ్యాయి. తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబరులో గుర్తించింది. తాజాగా గుజరాత్లో రెండు, ఒడిశాలో మరో ఒక వెలుగు చూశాయి. కేసుల్లో గణనీయమైన పెరుగుదల లేనప్పటికీ.. ఇప్పటికే బయటపడ్డ, కొత్త వేరియంట్లపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.గుజరాత్కు చెందిన ఓ ఎన్ఆర్ఐ ఈ ఏడాది నవంబరులో అమెరికా నుంచి వడోదరకి వచ్చారు. అమెకు కరోనా పాజిటివ్ రాగా.. నమూనాలను జన్యు విశ్లేషణ చేయడంతో బీఎఫ్.7గా గుర్తించారు. అయితే ఆ మహిళ మూడు డోసుల టీకా తీసుకున్నప్పటికీ వైరస్ సోకింది. ప్రస్తుతం ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవు. సెప్టెంబరులో విదేశాల నుంచి గుజరాత్లోని గోటాకి వచ్చిన మరో వ్యక్తికి ఇదే వైరస్ లక్షణాలు బయటపడ్డాయి.ఒమిక్రాన్ బీఏ.5కు చెందిన సబ్-వేరియంట్ బీఎఫ్.7కు విస్తృత వేగంతో వ్యాప్తి చెందే లక్షణం, బలమైన ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉంది. దీని ఇంక్యుబేషన్ వ్యవధి కూడా చాలా తక్కువ. గతంలో వైరస్ బారినపడి కోలుకున్నవారు, వ్యాక్సిన్ తీసుకున్న వారికీ ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం దీనికి ఉందని నిపుణులు అంటున్నారు. చైనాతో పాటు అమెరికా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి ఐరోపా దేశాల్లోనూ ఈ వేరియంట్ కేసులు ఇప్పటికే వెలుగు చూశాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకారం బీఎఫ్.7 అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. ఈ వేరియంట్ ఆర్వో(ఆర్ నాట్) 10 నుంచి 18.6గా ఉంది. అంటే.. ఒకరికి ఈ వేరియంట్ సోకితే.. వారి నుంచి కనిష్ఠంగా 10.. గరిష్ఠం సగటు 18.6 మందికి వ్యాప్తిచెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇది వేగంగా వ్యాపిస్తుంది. ఈ వేరియంట్ బారినపడ్డ వారిలో జ్వరం, దగ్గు, గొంతు గరగర, జలుబు, నీరసం, విపరీతంగా ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అతి కొద్ది కేసుల్లో వాంతులు, డయేరియా వంటి ఉదర సంబంధ వ్యాధుకు గురికావచ్చని తెలిపారు.టీకాలు తీసుకోనివారు లేదా వ్యాధినిరోధక తక్కువగా ఉండే వృద్ధులు, పిల్లలు, గర్భిణి మహిళలు, పలు అనారోగ్య సమస్యలతో (కేన్సర్, నియంత్రణలేని చక్కెర వ్యాధి, కార్డియాక్ లేదా కిడ్నీ వ్యాధులు) బాధిపడుతున్నవారు ఈ వేరియంట్ బారిపడితే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
‘‘బీఎఫ్.7 ఒమిక్రాన్ వేరియంట్ మరో ఉపవర్గం.. దీనికి వ్యాప్తి రేటు చాలా వేగం.. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మరణాల రేటు అంత ఎక్కువగా లేకపోయినా కానీ, ఇతర ఒమిక్రాన్ వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తిచెందుతుంది.. భారత్ విషయానికి వస్తే ఆస్పత్రిలో చేరడం, మరణాలు కొద్ది సంఖ్యలో ఉన్నాయి. కానీ, ఇది వ్యక్తి వ్యాధినిరోధకత, గతంలో అనారోగ్య సమస్యలు సహా పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది’’ అని ఏషియన్ హాస్పిటల్ అంటువ్యాధుల నిపుణుడు అన్నారు. మరణాలను అడ్డుకోడానికి నాలుగో డోస్ తీసుకోవడమే ఉత్తమని తెలిపారు.మాస్క్లు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వంటివి పాటించాలని, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు బూస్టర్ డోస్ తీసుకోవడం వల్ల మరణాలు, కొత్త వేరియంట్లు ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఆయన చెప్పారు.