ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఎట్టకేలకు ఈరోజు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఘటన జరిగిన అనంతరం కనిపించకుండాపోయిన అనంతరం ఇవాళ ఉదయం ఆశిష్ మిశ్రా క్రైం బ్రాంచీ పోలీసులు ముందు విచారణకు హాజరయ్యారు. లఖింపూర్ ఘటనలో విచారణకు హాజరుకావాలని పోలీసులు ఒక నోటీసును శుక్రవారం ఆయన ఇంటిముందు అంటించారు. అంతకుముందు, గురువారం కూడా పోలీసులు శుక్రవారం రాత్రి 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసు ఇచ్చారు. కానీ, ఆశిష్ రాలేదు. తరువాత, ఆశిష్ అనారోగ్యంతో ఉన్నాడని ఒక లేఖ రాశాడు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం విచారణకు హాజరుకావాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ నిన్న పోలీసులు మరోసారి నోటీసులు అంటించారు. దీంతో ఆశిష్ నేడు విచారణకు హాజరయ్యారు. మరోవైపు లఖింపుర్లో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. లఖింపుర్ హింసలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టు రమణ్ కశ్యప్ నివాసం వద్ద సిద్దూ ధర్నా చేపట్టారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు
లఖింపూర్లో ఇంటర్నెట్ సేవలు బంద్
.అక్టోబర్ 3 న హింసాకాండ తర్వాత మొదటిసారిగా లఖింపూర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దీని తరువాత, అక్టోబర్ 5 న లఖింపూర్ ఖేరి, సీతాపూర్, బహ్రైచ్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు అక్టోబర్ 8 సాయంత్రం నుండి లఖింపూర్లో ఇంటర్నెట్ మళ్లీ ఆగిపోయింది.లఖింపూర్ ఖేరీలో గత ఆదివారం నిరసనకారులను కారుతో ఢీకొట్టిన ఘటనలో నలుగురు రైతులు మరణించారు.అనంతరం జరిగిన దాడిలో మరో నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆశిష్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.