విశాలాంధ్ర`ఎమ్మిగనూరు : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీ కొరకు కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సోమవారం విద్యార్థి, యువజన సంఘాల అధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ సర్కిల్ వద్ద ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రంగన్న బైక్ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ శ్రీనివాస్ టాకీస్, ట్యాంక్ బండ్ రోడ్ మీదుగా సోమప్ప సర్కిల్, శివ సర్కిల్, పెద్ద పార్కుకు చేరుకొంది. అక్కడ రంగన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ ఈ నెల 19న ‘హలో నిరుద్యోగి.. చలో అమరావతి’ నినాదంతో విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల అధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థులు, యువజనులు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎంకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, భర్తీ నోటిఫికేషన్ మాత్రం వందల్లో విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు. నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కొరకు దశలవారీ ఆందోళనలు జరుగుతున్న ప్పటికీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరించే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. నియంతృత్వ పోకడలతో పిచ్చి తుగ్లక్ పాలన నడుస్తోందని ఎద్దేవా చేశారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సురేష్ కుమార్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేంద్ర బాబు, ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు సురేంద్ర రెడ్డి, నాగరాజు, ఏఐఎస్ఏ నాయకుడు సురేంద్ర, ఏపీఎస్ఎఫ్ నాయకుడు ఉసేన్లు మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్రెడ్డి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని గొప్పలు పలికారని, అధికారం చేపట్టినతర్వాత నిరుద్యోగుల జీవితాలను విచ్ఛిన్నం చేసేలా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మో హన్రెడ్డి స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేనిపక్షంలో భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలకు వెనుదీయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు రంగస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర, ఏఐవైఎఫ్ నాయకుడు రాజీవ్, పీడీఎస్యూ నాయకులు రామకృష్ణ, సమీర్, ఆర్ఏవీఎఫ్ నాయకులు ఖాజా, కృష్ణ, నాయకులు చిన్న, నవీన్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.