జహంగీర్పురిలో చట్టవిరుద్ధ ఆక్రమణలను తొలగించడం కోసం ఉత్తర ఢల్లీి నగర పాలక సంస్థ అధికారులు చేపట్టిన కార్యక్రమాన్ని ఆపాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. విద్వేషంతో కూడిన బుల్డోజర్స్ను ఆపాలని, పవర్ ప్లాంట్స్ను స్విచాన్ చేయాలని రాహుల్గాంధీ డిమాండు చేశారు. దేశంలో బొగ్గు కొరతను రాహుల్ బుధవారం ఇచ్చిన ట్వీట్లో ప్రస్తావించారు. అత్యధిక ద్రవ్యోల్బణం, తీవ్రమైన నిరుద్యోగం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆరోపించారు. ఎనిమిదేళ్ళపాటు గొప్ప గొప్ప మాటలు చెప్పారని, ఇప్పుడు కేవలం ఎనిమిది రోజులకు సరిపడిన బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విద్యుత్తు కోతల వల్ల చిన్నతరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతింటాయని, ఫలితంగా ఉపాధి అవకాశాలను కోల్పోవలసి వస్తుందని చెప్పారు. విద్వేష బుల్డోజర్లను స్విచాఫ్ చేసి, పవర్ ప్లాంట్స్ను స్విచాన్ చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ పేదలపై యుద్ధం ప్రకటించిందని అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. ఆక్రమణల పేరుతో ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో మాదిరిగానే ఢల్లీిలో కూడా ఇళ్ళను ధ్వంసం చేయాలని చూస్తోందన్నారు. చట్టవిరుద్ధ ఆక్రమణల విషయంలో ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వైఖరి అనుమానాస్పదంగా ఉందని మండిపడ్డారు. జహంగీర్ పురిలోని అక్రమ ఆక్రమణలను తొలగించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వంలోని పీడబ్ల్యూడీ శాఖ కూడా పాల్గొంటోందా? అని ప్రశ్నించారు. ఇలాంటి నమ్మక ద్రోహం చేస్తారని, పిరికితనంతో వ్యవహరిస్తారని ఆయనకు ఈ ప్రాంత ప్రజలు ఓటు వేశారా? అని ప్రశ్నించారు. ఆయన తరచూ పోలీసులులు తన నియంత్రణలో లేరని చెప్తున్నారని, ఈ సాకు ఇక్కడ పని చేయదని మండిపడ్డారు. ఈ విషయంలో చట్టబద్ధత, నైతికత ఎంత మాత్రం లేవన్నారు.