పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఇవాళ రాజ్యాంగ దినోత్సవ సంబరాలను నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాణానికి కృషి చేసినవారందరికీ నివాళులర్పించారు. రాజ్యాంగానికి రాజ్యాంగ సభ 1950లో ఆమోదం తెలిపిందని, ఆ తర్వాత ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాలను నిర్వహించి, దీని నిర్మాణం వెనుక జరిగిన కృషి గురించి అందరికీ తెలియజేసి ఉండవలసిందని అన్నారు. విభిన్నమైన మన దేశాన్ని.. మన రాజ్యాంగం ఏకీకృతం చేస్తుందని అన్నారు. ఎన్నో అవరోధాల తర్వాత రాజ్యాంగాన్ని రచించినట్లు ఆయన తెలిపారు. స్వతంత్య్రంగా ఉన్న రాష్ట్రాలను మన రాజ్యాంగం ఏకంగా చేసిందని మోదీ అన్నారు.రాజ్యాంగ దినోత్సవం రోజున మన పార్లమెంట్కు సెల్యూట్ చేయాలన్నారు. ఇక్కడే అనేక మంది నేతలు తమ మేథోమథనంతో రాజ్యాంగాన్ని రచించినట్లు చెప్పారు. మహాత్మా గాంధీతో పాటు దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన ఎంతో మంది నేతలకు నివాళి అర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ముంబైలో ఉగ్రదాడులు జరిగి నేటికి 14 ఏళ్లు అవుతోందని, ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన సాహస సైనికులకు నివాళ్లు అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల బృందం ఈ కార్యక్రమాలను బహిష్కరించడంతో, రాజకీయ పార్టీలు తమ ప్రజాస్వామిక లక్షణాన్ని కోల్పోకూడదని చెప్పారు. అలాంటి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఏవిధంగా కాపాడగలుగుతాయని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఎంసీ సహా 14 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. కాంగ్రెస్ పార్టీని నేరుగా ప్రస్తావించకుండా మోదీ మాట్లాడుతూ, కుటుంబాలు నాయకత్వం వహించే పార్టీలు రాజ్యాంగానికి అంకితమైనవారికి, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం కలవారికి ఓ సమస్యగా మారుతున్నట్లు తెలిపారు. ‘‘కుటుంబం కోసం, కుటుంబం ద్వారా, కుటుంబం యొక్క పార్టీ… మరింత చెప్పవలసి ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడారు. భారత రాజ్యాంగం ఆధునిక భగవత్ గీత అన్నారు. దేశం పట్ల మన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు రాజ్యాంగం మనల్ని ప్రేరేపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరం దేశం కోసం పనిచేయాలని తపిస్తే, అప్పుడు మనం ఏక్ భారత్, శ్రేష్ట భారత్ను నిర్మించవచ్చు అని స్పీకర్ బిర్లా తెలిపారు.