విశాలాంధ్ర`కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు శనివారం మరో సారి నోటీసు జారీ చేశారు. గత నెల 28న అవినాష్ రెడ్డి హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైన విషయం విదితమే. తాజాగా ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ లోని తమ కార్యాలయానికి మరోసారి విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు వాట్సాప్ ద్వారా అవినాష్ కు నోటీసులు పంపారు. తనకు నోటీసులు అందిన విషయం వాస్తవమేనని ఆయన ధ్రువీకరించారు. కాగా వివేకా హత్య కేసులో రెండోసారీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి అవినాష్రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డికి కూడా సీబీఐ నోటీసు జారీచేసింది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగినప్పటి నుంచి.. ప్రతిపక్షాల వేళ్లన్నీ ఎంపీతో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి వైపే చూపిస్తున్నాయి. 2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టి 248 మంది సాక్షులు, అనుమానితులను విచారించి.. వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఆ వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలతో ఇప్పుడు కీలకమైన అవినాష్రెడ్డిని విచారిస్తోంది. గత నెల 28న అవినాష్రెడ్డిని విచారించిన తరువాత కాల్డేటా ఆధారంగా సీఎం జగన్ సతీమణి భారతి సహాయకుడు నవీన్, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డికి నోటీసులిచ్చి కడప కేంద్ర కారాగారంలో విచారించారు. తాజాగా అవినాష్రెడ్డిని విచారించేందుకు సీబీఐ మళ్లీ నోటీసు జారీచేయడం చూస్తే ఈ కేసులో సీబీఐ దూకుడు పెంచినట్టు అనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేకా కేసు హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే.