తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించాలని ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో జరుగుతున్న తీవ్ర జాప్యంపై దేశ అత్యు న్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని, విచారణపై తాజా పరిస్థితిపై నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. అసలు ఇన్నిరోజులుగా వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయడం లేదని సీబీఐపై సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం కురిపిం చింది. దర్యాప్తు అధికారి ఎందుకు విచారణను జాప్యం చేస్తున్నారని నిలదీసింది. విచారణ త్వరగా ముగించలేకపోతే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదో చెప్పాలని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి సమర్ధవంతుడు కాకపోతే ఆయన స్థానంలో వేరొకరిని నియమించడంపై సీబీఐ డైరెక్టర్ అభిప్రాయం అడిగి చెప్పాలని సీబీఐ తరపు న్యాయ వాది నటరాజన్ను న్యాయస్థానం ఆదేశించింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు అధికారి రాంసింగ్ విచారణను జాప్యం చేస్తున్నందున మార్చాలని పిటిషన్లో ఆమె కోరారు. దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ
చేస్తున్నారని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. అనంతరం కేసు విచారణను ధర్మాసనం ఈరోజుకి వాయిదా వేయగా, సీబీఐపై సుప్రీం సీరియస్ అయింది. గతంలో రాంసింగ్పై వివేకా హత్య కేసులో నిందితులు కేసు పెట్టారు. ఈ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది.
వివేకా కేసులో కీలక పరిణామం!
ఇదిలాఉండగా తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో ఏ-4 దస్తగిరిని అప్రూ వర్గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదు. సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నారు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడు. కీలక పాత్ర పోషించిన దస్తగిరికి బెయిల్ ఇవ్వటం సరికాదు. వివేకా హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరినే.. ఆయనకు బెయిల్ సమయంలోను సీబీఐ సహకరించింది. దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని భాస్కర్ రెడ్డి తన పిటీషన్లో పేర్కొన్నారు.