ఏపీ, తెలంగాణల్లో వచ్చే ఐదు రోజుల్లో భారీగా పడే అవకాశం
చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలకు ఆవర్తనాలు తోడవడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) దేశంలోని పలు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. రాగల ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఖరీఫ్ సీజన్ పంటలకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలు కారణంగా రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పది రోజులుగా అడపా, దడపా కురుస్తున్న వర్షాలకు మెట్ట పంటలకు విత్తనాలు మొదలయ్యాయి. వేరుశనగ, వరి, మొక్కజొన్న, చెరకు, జనపు నారతోపాటు అనేక వాణిజ్య పంటల విత్తనాలు జల్లుతున్నారు. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలకు ఆవర్తనాలు తోడవడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) దేశంలోని పలు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. రాగల ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా, రానున్న ఐదు రోజుల పాటు కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. విశాఖ నగరంలో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలను జలమయం చేసింది. తీరం వెంబడి ఉధృతంగా అలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో మత్యకారులు ఆందోళనకు గురవుతున్నారు.
హైదరాబాద్లో రెడ్ అలర్ట్
హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల రెండు రోజులు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్నం తెలిపారు. గడిచిన 24గంటల్లో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడిరచారు. రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్, ఆ తరువాత రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని వెల్లడిరచారు. ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణం కన్నా 45శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని వివరించారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీమ్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, జనగామ, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, నారాయణ్పేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసినట్టు హైదరాబాద్ వాతావరణం కేంద్రం పేర్కొంది.
వరదనీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు వరదనీటిలో చిక్కుకుంది. ఇటీవల విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మాచన్పల్లి-కోడూరు మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరదనీరు భారీగా చేరింది. ఈ క్రమంలో రామచంద్రపురం నుంచి సుగురు తండాకు వెళ్తున్న స్కూల్ బస్సు.. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరదనీటిలో చిక్కుకుంది. దాదాపు సగభాగం వరకు బస్సు నీటిలో ఉండటంతో అందులోని విద్యార్థులు ఆర్తనాదాలు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు.. విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం బస్సును ట్రాక్టర్ సాయంతో బయటకు లాగారు.