విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్కు ఉన్న అధికారాలను తొలగించేలా తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్శిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె.పొన్నుడి ఇవాళ ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం వల్ల ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. కొంత కాలంగా వస్తున్న సంప్రదాయం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ సలహాలు, సంప్రదింపులతో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల ఎంపిక జరుగుతోందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం గుజరాత్లో కూడా గవర్నర్ వీసీలను నియమించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తోందని స్టాలిన్ పేర్కొన్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా కొత్త ట్రెండ్ వచ్చిందని, ఉపకులపతుల నియామకాలు తమ హక్కులుగా గవర్నర్ భావిస్తున్నారని సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఇలా చేయడం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అవమానించడమే అవుతుందని స్టాలిన్ దుయ్యబట్టారు.గవర్నర్ ఇలా వ్యవహరించడం వల్ల అధికార యంత్రాంగంలో తీవ్ర గందరగోళం నెలకొందని అన్నారు.