ముంబై: స్వంతత్ర పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ రాణాను బైకుల్లా జైలుకు, ఆమె భర్త, ఎమ్మెల్యే రవిరాణాను కట్టుదిట్టమైన భద్రత మధ్య తలోజా జైల్కు పంపినట్టు అధికారులు సోమవారం తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే సొంత నివాసం ‘మాతోశ్రీ’ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ పిలుపునిచ్చిన సందర్భంగా రాణా దంపతులను శనివారం అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఆదివారం ముంబై కోర్టు వారికి 14రోజుల జ్యుడిషిల్ కస్టడీ విధించింది. దీంతో నవనీత్ను ఆదివారం రాత్రి బైకుల్లా మహిళా జైలుకు తరలించగా, ఆమె భర్తను మొదట ఆర్ధర్ రోడ్డులోని జైలుకు తరలించారు. అక్కడ స్థలం లేకపోవడంతో నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించినట్టు అధికారులు వివరించారు.