. అర్హత ఉన్న ప్రతి రైతుకు ఉచిత విద్యుత్ కనెక్షన్
. జగనన్న కాలనీల్లో విద్యుద్దీకరణ పనులకు ప్రాధాన్యత
. సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వేసవిలో విద్యుత్ డిమాండ్ అధికమవుతున్నా ప్రణాళికాయుతంగా విద్యుత్ ఉత్పాదనను సాగిస్తూ, ప్రజలకు కోతలు లేకుండా విద్యుత్ను అందిస్తున్నామని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లోనూ ఇదే తరహాలో విద్యుత్ సరఫరా కొనసాగాలని, ఎట్టిపరిస్థితుల్లో కోతలుండరాదని మంత్రి స్పష్టం చేశారు. అలాగే అర్హతే ప్రమాణికంగా దరఖాస్తు చేసిన ప్రతి ఒక్క రైతుకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ను అందించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని మూడో బ్లాక్లో సోమవారం సీపీడీసీఎల్ విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఈ ప్రభుత్వం అండగా నిలవాలన్న లక్ష్యంతో తొమ్మిది గంటల పాటు పగటిపూట ఉచితంగా విద్యుత్ను అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. దీనికి అనుగుణంగా ఉచిత విద్యుత్ కోసం వచ్చే దరఖాస్తులకు ఎటువంటి తుది గడువు ఉండకూడదని, వచ్చే దరఖాస్తులను ఎప్పటి కప్పుడు పరిశీలించి విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయాలని డిస్కం అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులకు జూన్ 15వ తేదీలోగా పరిష్కరించి, కనెక్షన్లను మంజూరు చేయాలని ఆదేశించారు. మార్చి నెలాఖరు నాటికి దాదాపు 1.20 లక్షల విద్యుత్ కనెక్షన్లను వ్యవసాయానికి అందించామని తెలిపారు. జగనన్న హౌసింగ్ కాలనీలకు విద్యుద్దీకరణను నిర్ణేశిత లక్ష్యంలోగా పూర్తి చేయాలన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల అధ్వర్యంలో పంపిణీ నష్టాలను పూర్తి స్థాయిలో నియంత్రణలోకి తీసుకురావాలని కోరారు. సీపీడీసీఎల్ పరిధిలో పారిశ్రామిక సంస్థల నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేసేందుకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. అలాగే కోర్టు కేసుల వల్ల దీర్ఘకాలంగా పెండిరగ్లో ఉన్న బకాయిలపైన కూడా దృష్టి సారించాలని చెప్పారు. ఇప్పటికే టెండర్లు, అవార్డుల స్థాయిలో ఉన్న సబ్ స్టేషన్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎనర్జీ) కె.విజయానంద్, ఏపీ జెన్కో ఎండీ చక్రధర్ బాబు, జె.ఎస్.కుమార్ రెడ్డి, సీపీడీసీఎల్ సీఎండీ పద్మాజనార్థన్ రెడ్డి, అనేక మంది ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.