. పెద్దిరెడ్డి ఉవాచ
. మార్చి నాటికి వంద కొత్త సబ్స్టేషన్లు
. ప్రైవేట్ కంపెనీల బకాయిల వసూళ్లపై దృష్టి
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రానున్న వేసవిలో డిమాండ్కు తగ్గట్లుగా విద్యుత్ ఉత్పాదనకు ప్రణాళిక సిద్ధం చేసుకుని విద్యుత్ కోతల్లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలోని మూడో బ్లాక్లో సోమవారం ఇంధనశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కృష్ణపట్నం, ఎన్టీఈపీఎస్లోని కొత్త యూనిట్లను కూడా వినియోగంలోకి తీసుకొచ్చేలా పనులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం రోజుకు 210 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ డిమాండ్ 240 మిలియన్ యూనిట్లకు పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలను పెంచుకోవాలన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.25 లక్షల కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రైతులకు అందించనున్నట్లు మంత్రి వెల్లడిరచారు. రాష్ట్రవ్యాప్తంగా పగటిపూట తొమ్మిదిగంటల పాటు నాణ్యమైన విద్యుత్ను రైతన్నలకు అందించాలని, అలాగే అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారుకి ఉచిత విద్యుత్ కనెక్షన్ను మంజూరు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సబ్స్టేషన్లలో 100 సబ్స్టేషన్లను కూడా అదే గడువు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కర్మాగారాలు, వ్యాపార సంస్థలు, హెచ్టీి కనెక్షన్ల నుంచి రావాల్సిన రూ.349 కోట్లు బకాయిలపై డిస్కంలు దృష్టి సారించాలని, రెగ్యులర్ విద్యుత్ బిల్లులతో పాటు, బకాయిలకు కూడా డిమాండ్ నోటీస్లను జారీ చేయాలని సూచించారు. జగనన్న లేఅవుట్ల విద్యుతీకరణపై సమీక్షించగా, మొత్తం 9979 జగనన్న కాలనీ లేఅవుట్లకు గాను ఇప్పటివరకు 2617 లేఅవుట్లలో విద్యుదీకరణ పూర్తయినట్లు అధికారులు వివరించారు. ఈ సమీక్షలో ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయానంద్, ట్రాన్స్కో సీిఎండీ బీ శ్రీధర్, జేఎండీ ఐ.పృథ్వితేజ్, విజిలెన్స్ జేఎండీ మల్లారెడ్డి, ట్రాన్స్ కో సీఎండీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.