ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. హత్య కేసులో సాక్ష్యాధారాలను నాశనం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. దర్యాఫ్తుపై మృతుడి భార్య, కూతురు అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇక్కడి (సుప్రీంకోర్టు) దాకా రావడం బాధాకరమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసు విచారణను బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేశన్ లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో అనేక కోణాలు ఉన్నాయని, ఎవరిని ప్రశ్నించాలన్నా అడ్డంకులు తప్పట్లేదని సీబీఐ వాపోయింది. విచారణాధికారులను కేసుల పేరుతో వేధింపులకు గురిచేశారని కోర్టుకు వెల్లడిరచింది. విచారణకు స్థానిక యంత్రాంగం అసలు ఏమాత్రం సహకరించలేదని సీబీఐ ఆరోపించింది. ఈమేరకు కోర్టులో దాఖలు చేసిన ప్రత్యేక అఫిడవిట్లో సీబీఐ పేర్కొంది.దీంతోపాటు సీబీఐ ఆరోపణలకు వైఎస్ సునీత మద్దతు తెలపడం, హత్య కేసులో కుట్రను బయటపెట్టాలంటే నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేయడాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనకున్న కుట్ర కోణాన్ని వెలుగులోకి తీసుకురావడం కోసం విచారణను కడప కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది.