Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వైద్యారోగ్యశాఖలో ఖాళీలన్నీ భర్తీ

. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం పకడ్బందీగా అమలు
. క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడిట్‌
. సీఎం జగన్‌ ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వైద్యారోగ్యశాఖలో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా సిబ్బంది లేరనే మాట రాకూడదని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలలో నాడు – నేడు పనులపై సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడిట్‌ చేయాలని, మౌలిక సదుపాయాలు, మందులు సరిపడా ఉండేలా చూసుకోవాలన్నారు. కోవిడ్‌ తాజా పరిస్థితులపై సీఎం ఆరా తీయగా, రాష్ట్రంలో కోవిడ్‌ పూర్తిగా అదుపులో ఉందని, గత వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఏపీ 23 స్థానంలో ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ రోగులు కేవలం 24 మంది మాత్రమేనని, వీరంతా కూడా కోలుకుంటున్నారని అధికారులు వెల్లడిరచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే నిర్వహించామని, స్వల్ప సంఖ్యలో లక్షణాలు ఉన్నవారిని గుర్తించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రతి వైయస్సార్‌ క్లినిక్‌లో కూడా 20 ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను ఉంచామని, 14 ఆర్టీపీసీఆర్‌ ల్యాబులు పనిచేస్తున్నాయని, ఎయిర్‌పోర్టులలో విదేశాల నుంచి వచ్చేవారికి టెస్టులు చేస్తున్నామని వివరించారు. ఆక్సిజన్‌ యూనిట్లు, పైపులైన్లు, మాస్క్‌లు, మందులు, పీపీఈ కిట్లు ఇవన్నీ కూడా సరిపడా ఉన్నాయని సీఎంకు తెలియజేశారు. ఇక ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఏప్రిల్‌ 6 నుంచి 28 వరకూ 20,25,903 మందికి సేవలందించినట్లు అధికారులు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్‌ వచ్చేముందు ఎప్పుడు వస్తున్నారన్న దానిపై ముందుగానే తేదీలు ఇవ్వాలి. ఆ తేదీలను ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా గ్రామాల్లో ప్రజలకు తెలిపేలా చేయాలి. దీనివల్ల వారు ఫ్యామిలీ డాక్టర్‌ వద్దకు వచ్చి వైద్యం పొందుతారు. అలాగే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయాలి. అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.కొత్త మెడికల్‌ కాలేజీల కారణంగా 2100 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయని, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2185 మెడికల్‌ సీట్లకు ఇవి అదనం అని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ జె నివాస్‌, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్‌ హరీందిర ప్రసాద్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌, డైరెక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ డీఎస్విఎల్‌ నరసింహం, డైరెక్టర్‌ పబ్లిక్‌ హెల్త్‌ వి రామిరెడ్డి, డైరెక్టర్‌ (టెక్నికల్‌) నాడు నేడు ఆర్‌ మనోహర రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ డాక్టర్‌ బి చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img