ఆంక్షల బాటలో భారత్
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 12కు పైగా దేశాల్లో ఈ వేరింట్ తాలుకూ కేసులు బయటపడ్డాయి.దీంతో ప్రపంచ దేశాలు మరోసారి ఆంక్షల బాట పట్టాయి. ఒమిక్ర్రాన్ ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సైతం హెచ్చరించడంతో ఈ వేరియంట్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటివరకు భారత్ సహా 15 దేశాలు ప్రయాణ నిషేధాలు, ఆంక్షలు విధించాయి. ఈ జాబితాలో యూఏఈ, అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, కువైత్, బహ్రెయిన్, ఒమన్, మొరాకో, జపాన్, ఇజ్రాయిల్, భారత్, బ్రెజిల్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఉన్నాయి.
ఒమిక్రాన్ కారణంగా భారత్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దేశాలతో పాటు వాటితో లింకులున్న 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్, కరోనా టెస్టు తప్పనిసరి చేసింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా, చైనా, యూకే, న్యూజిలాండ్, సింగపూర్, ఇజ్రాయిల్, బంగ్లాదేశ్, హాంగ్కాంగ్, బోత్స్వానా, మారిషస్, రెండు యూరోప్ దేశాలు ఉన్నాయి. డిసెంబర్ 1 నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ మేరకు భారత ఆరోగ్యశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచన చేసింది. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్, కోవిడ్ పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించింది.