కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఇంగ్లీష్ పరిజ్ఞానం గురించి తెలిసిందే. ఆయన్ను ‘డిక్షనరీ’ అని పిలుస్తుంటారు. ఆయన ట్వీట్లలో ఉపయోగించే ఆంగ్ల పదాల అర్థాల కోసం డిక్షనరీలు వెతుక్కోవ్వాల్సిందే. ఆయన కొత్త కొత్త పదాలను పరిచయం చేస్తూ ఇంగ్లిష్ పై తనకున్న పట్టును ఆయన అందరికీ తెలియజేస్తుంటారు. అలాంటి వ్యక్తి తాజాగా చేసిన ఓ ట్వీట్లో అక్షర దోషాలు కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలేను విమర్శిస్తూ చేసిన ట్వీట్లో థరూర్ కొన్ని పదాలు తప్పుగా రాసారు. దీంతో అథవాలే ఆ తప్పులను ఎత్తిచూపుతూ సెటైర్లు వేశారు. అసలేం జరిగిందంటే సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఓ ఫొటోను పోస్ట్ చేసిన థరూర్.. ప్రభుత్వంలోని మంత్రులే నమ్మడం లేదని పేర్కొంటూ ఆ ఫొటోలో నిర్మలవైపు అథవాలే ఆశ్చర్యంగా చూస్తున్నారంటూ ఎత్తి చూపారు. ‘‘దాదాపు రెండు గంటల పాటు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై అయోమయంతో షాక్ అయిన మంత్రి రాందాస్ అథవాలే మొహమే బడ్జెట్ ఎలా ఉందో చెబుతుంది. ఆర్థిక వ్యవస్థ, బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ ప్రకటనలపై సభ మొదటి వరుసవాళ్లకే నమ్మకం లేదు’’ అని ట్వీట్ చేశారు. అయితే అందులో బడ్జెట్ , రిప్లై అనే పదాలను థరూర్ తప్పుగా రాశారు. ఆ ట్వీట్ లో తన ప్రస్తావన రావడంతో అసహనం వ్యక్తం చేసిన మంత్రి రాందాస్ అథవాలే.. థరూర్ పై రుసరుసలాడారు. ముందు అక్షరదోషాలు సరిచేసుకోవాలంటూ సూచించారు. ‘‘అనవసరమైన ప్రకటనలు, వ్యాఖ్యలు చేసేవారు తప్పులు చేస్తుంటారని చెబుతుంటారు. మీరూ చేశారు శశిథరూర్ గారూ అంటూ తప్పులు ఎత్తిచూపి..అయినా మాకు అర్థమైంది లెండి అంటూ సెటైర్ వేశారు. కాగా, శశిథరూర్ తప్పుగా టైప్ చేయడంపై నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు డిక్షనరీ కూడా ఇలాంటి తప్పులు చేస్తుందా? అని తెల్లమొహం వేస్తున్నారు. అయితే, ఆయన్ను తప్పుబట్టాల్సిన అవసరం లేదని, ఏదో జోక్ గా చేసి ఉంటారని అంటున్నారు. అయితే, థరూర్ కూడా అంతే ధీటుగా సమాధానమిచ్చారు. ‘చెత్త ఇంగ్లీష్ కన్నా నిర్లక్ష్యపు టైపింగ్ చాలా పెద్ద పాపం. అని అంటూనే ‘అయితే జేఎన్యులో కొందరికి మీ ట్యూషన్ అవసరం అంటూ సెటైర్ వేశారు. ఇటీవల దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ కొత్త వైస్ ఛాన్సలర్ చేసిన ఓ ప్రకటనలో అక్షర దోషాలు కన్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ థరూర్..అథవాలేకు కౌంటర్ ఇచ్చారు.