నవంబరు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు
తొలిదశలో 258 మండలాల్లో ప్రారంభం
జనవరి 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సేవలు
వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్
అమరావతి : వైద్య ఆరోగ్యశాఖలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఇప్పటివరకు కొంత మంది వ్యక్తులకే పరిమితమైన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్(కుటుంబ డాక్టరు)ను ఇకపై ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ సరికొత్త విధానంపై ఆలోచన చేయాలని గత సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖాధికారులకు సూచించిన సీఎం జగన్…ఇప్పుడు దానిని అమలు చేయడానికి తుదిగడువు విధించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వాక్సినేషన్, హెల్త్ హబ్లు, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లపై మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష జరిగింది. అన్ని జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న హెల్త్హబ్లో 50శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ రోగులకు కేటాయించాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కు సంబంధించి విధివిధానాలను అధికారులు సీఎంకు వివరించారు. వాటిలో కొన్ని మార్పులు, చేర్పులు సూచిస్తూ తక్షణమే ఈ కొత్త ఆలోచన అమలుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. నవంబరు 15 నుంచి తొలిదశలో 258 మండలాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయాలని, జనవరి 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కావాలని స్పష్టం చేశారు. జనాభాను దృష్టిలో ఉంచుకుని 104లను ఇందుకోసం వినియోగించాలని సూచించారు. ప్రతి గ్రామసచివాలయంలో కనీసం నెలకు రెండుసార్లు 104 ద్వారా వైద్యుల సేవలందేలా చూడాలన్నారు. పీహెచ్సీలో కనీసం ఇద్దరు డాక్టర్లు ఉండాలని, ఒకరు పీహెచ్సీలో, మరొకరు 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానంలో సేవలు అందించేలా విధివిధానాలు రూపొందించాలన్నారు. ఇందుకోసం కొత్త పీహెచ్సీల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న చార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న చార్జీలు మెరుగ్గా ఉన్నాయన్నారు. ఎవరు ఎక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్హబ్స్లో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. హెల్త్హబ్బుల ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ఒక సభ్యుడు ప్రభుత్వం నుంచి ఉంటారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన డాక్టర్లు ఇక్కడే స్థిరపడి మంచి వైద్య సేవలందించే ఉద్దేశం హెల్త్హబ్స్ ద్వారా నెరవేరుతుందని సీఎం ఆకాంక్షించారు. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ప్రామాణికం కావాలన్నారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్హబ్స్లో ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఎటువంటి వైద్యసేవలకైనా ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణా విధానాలను అధికారులు వివరించగా, హెల్త్హబ్స్ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారుల నియామకం అవసరమని సీఎం చెప్పారు. బిల్డింగ్ సర్వీసులు, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసులు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సేవలను అధికారులు నిర్వహిస్తారని తెలిపారు. పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ అధికారుల నియామకానికి సీఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అనంతరం కోవిడ్ నియంత్రణాచర్యలు, వాక్సినేషన్పై సీఎం సమీక్షించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.