న్యూదిల్లీ : బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహం చట్టంపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఇకపై నిజాన్ని/సత్యాన్ని అణచివేయలేరంటూ కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. అసంతృప్తి గొంతుకను తొక్కేసేవారికి స్పష్టమైన సందేశం వెళ్లిందని అభిప్రాయపడిరది. ‘నిజం/సత్యం పలకడం దేశభక్తేగానీ దేశద్రోహం కాదు. నిజాన్ని వినడం రాజధర్మం.. దానిని అణచివేయడం దురహంకారం. ప్రజలు భయపడాల్సిన పనిలేదు’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ట్వీట్ చేశారు. తాజా పరిణామంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా స్పందించారు. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించిందన్నారు. ప్రజాభిప్రాయాలను, అసంతృప్తిని, విమర్శలను నిరంకుశంగా అణచివేసే వారికి సుప్రీంకోర్టు తీర్పుతో ఇకపై అలాంటివి కుదరవన్న స్పష్టమైన సందేహం అందిందని సూర్జేవాలా పేర్కొన్నారు. ‘బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడాం. దేశద్రోహం చట్టాన్ని లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలపై విధించారు. దాని రద్దుకు సమయం ఆసన్నమైంది. 2019 మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇదే హామీనిచ్చింది. సప్రీంకోర్టు ఎట్టకేలకు దేశద్రోహం చట్టంపై స్టే విధించింది. రాజ్యాంగం, సత్యస్వరం అణచివేత కుదరదని తేల్చిచెప్పింది’ అని సూర్జేవాలా ఓ ప్రకటన చేశారు.