వందేళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి
రెండేళ్లలో ఎట్టిపరిస్థితుల్లో పూర్తికావాలి
అవినీతికి తావులేకుండా.. ఆదర్శవంతంగా జరగాలి
ప్రతి నాలుగు వారాలకోసారి విధిగా సమీక్షిస్త్తా
శాశ్వత భూహక్కు-భూరక్షపై సమీక్షలో సీఎం జగన్
అమరావతి : వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా ఏపీలో చేపడుతున్న సమగ్ర భూసర్వే 2023 జూన్ నాటికి ఎట్టిపరిస్థితుల్లో పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శాశ్వత భూహక్కు-భూరక్షపై ఆయన గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సర్వేను అత్యంత ప్రాధాన్యత అంశంగా చేపట్టాలని, అవినీతి రహితంగా, ఆదర్శవంతంగా ఈ ప్రక్రియ జరగాలని స్పష్టం చేశారు. సర్వేచేసిన వెంటనే గ్రామాల వారీగా మ్యాపులతో సైతం రికార్డులు అప్డేట్ కావాలన్నారు. భూమి కార్డులను రైతులకు ఇవ్వాలని, అనుకున్న సమయంలోగా సర్వేను పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. సర్వే త్వరితగతిన పూర్తిచేయడానికి అవసరమైన వనరులు సమకూర్చుకోవాలని ఆదేశించారు. డ్రోన్లు సహా ఇతర సాంకేతిక పరికరాలను అవసరమైన మేర కొనుగోలు చేయాలని చెప్పారు. సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలని సీఎం మార్గనిర్దేశనం చేశారు. అవసరమైతే ఇందుకోసం బయట నుంచి నిపుణుల సేవలు వినియోగించు కోవాలని సూచించారు. ఇంత పెద్దఎత్తున చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది, శిక్షణ తదితర అన్ని అంశాలతో తొలుత సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులకు సమగ్ర భూసర్వేపై ఏర్పాటైన కేబినెట్ సబ్కమిటీ ప్రతివారం కచ్చితంగా సమావేశమై సమీక్ష చేయాలని స్పష్టం చేశారు. స్పందనలో భాగంగా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్లోనూ దీనిపై తాను స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సంబంధిత విభాగాల అధికారులతోనూసమగ్ర సర్వేపై సమీక్ష చేస్తానని, అందువల్ల ఈ సమగ్ర సర్వేను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు.సర్వే ఆఫ్ ఇండియాతో సమన్వయం చేసుకోవడంతోపాటు వారి సహకారం తీసుకోవాలని చెప్పారు. సర్వే రాళ్ల కొరత లేకుండా చూడాలని, సకాలంలో వాటిని అప్పగించాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, రెవెన్యూశాఖ కమిషనర్ సిద్దార్ధజైన్, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.