Friday, April 19, 2024
Friday, April 19, 2024

సమగ్ర సర్వేతో భూసమస్యలకు చెక్‌

పట్టణ ప్రాంతాల్లో ఎదురయ్యే ప్రతిబంధకాలను గుర్తించాలి
గ్రామకంఠంలో యాజమాన్య ధ్రువీకరణ రెవెన్యూదే
జగనన్న భూహక్కు-భూరక్ష పై మంత్రుల కమిటీ సమీక్ష

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భూ సమగ్ర సర్వేతో భూ సమస్యలకు చెక్‌పడుతుందనీ, అందువల్ల ఈ సర్వేను మరింత వేగవంతం చేయాలని మంత్రుల కమిటీ అధికారులను ఆదేశించింది. సచివాలయంలోని మూడో బ్లాక్‌లో శుక్రవారం రాష్ట్ర ఇంధన, అటవీ, గనులు, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జగనన్న భూహక్కు-భూరక్ష పథకంపై మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు అజేయ్‌ కల్లాంతో పాటు సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు భూసర్వేకు సంబంధించి జరుగుతున్న ప్రగతిని మంత్రుల కమిటీకి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 52 డ్రోన్‌లతో సమగ్ర భూసర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. త్వరలోనే సర్వే ఆఫ్‌ ఇండియా, ఏపీ ప్రభుత్వం, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా మొత్తం 172 డ్రోన్‌లను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడిరచారు. ఇప్పటి వరకు 2,149 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే జరిగిందని, అలాగే 756 గ్రామాలకు గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పూర్తయిందని తెలిపారు. 535 గ్రామాల్లో గ్రౌండ్‌ వ్యాలిడేషన్‌ పూర్తి చేశామని, వీటికి సంబంధించి 9,283 అప్పీళ్లు ప్రజల నుంచి అందాయని, వాటిల్లో 8,935 అప్పీళ్లను పరిష్కరించామని వివరించారు. సర్వే చేసిన 51 గ్రామాల పరిధిలో సర్వే రాళ్లను పాతే కార్యక్రమం వేగంగా జరుగుతోందని, 18,487 సర్వే రాళ్లను ఇప్పటికే పాతినట్లు తెలిపారు. ప్రస్తుతం 13 జిల్లా కేంద్రాల్లో ప్రాసెసింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా సర్వే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నామని, జూన్‌ నాటికి మరో 13 జిల్లా కేంద్రాల్లో ప్రాసెసింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మొత్తం అన్ని జిల్లాల్లో ఆగస్టు నాటికి డ్రోన్‌ సర్వే ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 123 అర్బన్‌ స్థానిక సంస్థలు ఉన్నాయి. వీటిల్లో 5548.90 చదరపు కిలోమీటర్ల పరిధిలో 30 లక్షల నిర్మాణాలు, 7 లక్షల మేర ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ 37 అసెస్‌ మెంట్‌లకు సర్వే నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలోని రెండు వార్డుల్లో సర్వే పూర్తయినందున, దాని ఆధారంగా అర్బన్‌ ప్రాంతాల్లో సర్వే ప్రక్రియను కొనసాగిస్తామని అధికారులు వివరించారు. ఇక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గ్రామకంఠంలో నిబంధనల మేరకు ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్లను రెవెన్యూ విభాగం ద్వారా జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అటవీ భూముల సరిహద్దులపై ఇప్పటికే వివరాలు తీసుకున్నామని, మరో 15 రోజుల్లో భూముల హద్దులను గుర్తిస్తామని అధికారులు వెల్లడిరచారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ అటవీ భూములకు సంబంధించి గతంలో జరిగిన అవకతవకలను జగనన్న భూహక్కు-భూరక్ష ద్వారా సరిదిద్దాలని సూచించారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్త సమావేశాలు నిర్వహించి నిర్ధిష్టంగా సరిహద్దులను గుర్తించాలని, ఎక్కడైనా ఆక్రమణలు జరిగినట్లు తేలితే వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి.సాయి ప్రసాద్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ (హౌసింగ్‌) అజయ్‌ జైన్‌, కోన శశిధర్‌, ప్రవీణ్‌ కుమార్‌, చిరంజీవి చౌదరి, వి.సునీత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img