ఎకరం రూ.10 కోట్లు
అమరావతి భూములు విక్రయానికి సిద్ధం
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన భూములను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవరత్నాల అమలే లక్ష్యంగా ఎడాపెడా అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు అమరావతి భూములపై కన్నేసింది. గతంలో ఈ భూములను తనఖా పెట్టి అప్పు తీసుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో, ఇప్పుడు ఏకంగా వేలం ద్వారా విక్రయించి సొమ్ము చేసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. అమరావతి వ్యవహారాలను పర్యవేక్షించే రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) దీనికి సంబంధించిన ప్రణాళిక రూపొందించింది. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో వివిధ సంస్థలకు కేటాయించిన భూములను అమ్ముకోవడానికి వీలు కల్పిస్తూ శనివారం జీవో 389 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. భూసమీకరణలో భాగంగా రైతులు రాజధాని నిర్మాణానికి ఇచ్చిన సుమారు 34వేల ఎకరాల భూముల్లో తొలి విడతగా 248.34 ఎకరాలను విక్రయించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. జులై మొదటివారంలో వేలం వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న సీఆర్డీఏ ఎకరాకు రూ.10 కోట్లు కనీస విలువగా సర్కార్ వారి పాటను నిర్ణయించింది. ఆ విధంగా మొత్తం రూ.2,480 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. రాజధానిలో మెడ్సిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం 100 ఎకరాలను కేటాయించింది. అదేవిధంగా లండన్ కింగ్స్ కాలేజీ నిర్మాణం కోసం 148.34 ఎకరాలు ఇచ్చింది. వీటిలో ఆ సంస్థలు నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఈ భూమిని విక్రయించి డబ్బు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గత ప్రభుత్వం వివిధ సంస్థలకు దాదాపు 1300 ఎకరాలు కేటాయించింది. వీటిలో కూడా నిర్మాణాలు చేపట్టని భూములను దశలవారీ అమ్మడం ద్వారా డబ్బు సమీకరించాలని సీఆర్డీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. తొలివిడత వేలం విక్రయానికి వచ్చే స్పందనను బట్టి మిగిలిన భూమిని కూడా విడతలవారీ విక్రయించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ప్రస్తుతం అమ్మే 248 ఎకరాలతో పాటు మరో 600 ఎకరాల విక్రయానికి కూడా సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందించింది.
రాజధాని రైతుల ఆగ్రహం
గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన రాజధాని నిర్మాణపనులను అర్థాంతరంగా నిలిపివేసి, హైకోర్టు తీర్పును సైతం అమలు చేయకుండా భూముల అమ్మకానికి ప్రభుత్వం జీవో జారీ చేయడంపై రాజధాని కోసం ఉచితంగా భూములిచ్చిన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని ముంపు ప్రాంతమని, ఎడారి అని, శ్మశానమని, ఈ భూమి భవన నిర్మాణాలకు పనికిరాదని, రెట్టింపు ఖర్చు అవుతుందని దుష్ప్రచారం చేసిన ప్రభుత్వం…ఇప్పుడు అదే భూమి అమ్మకానికి ఎలా పనికి వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. పైగా ఎకరానికి రూ.10 కోట్లు ధర నిర్ణయించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం రాజధాని నిర్మాణ ప్రణాళిక చూపించి, ఆవిధంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో రాజధాని నిర్మాణం చేపడతామని హామీ ఇస్తేనే సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఉచితంగా భూములిచ్చామని రైతులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులు అకస్మాత్తుగా నిలిపివేయడంతో పాటు, మూడు రాజధానుల పాట పాడుతూ రాజధాని ప్రాంతంలో వేసిన రోడ్లను కూడా ధ్వంసం చేసింది. బహుళ అంతస్తుల భవనాలను పాడుపెట్టింది.
చివరకు పేదల కోసం టిడ్కో అధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను సైతం వారికి అప్పగించకుండా వాటిని నాశనం చేస్తుంది. హైకోర్టు తీర్పును సైతం ఖాతరు చేయడం లేదు. భూములిచ్చిన రైతులు, మహిళలు, వృద్ధులపై వేలాది అక్రమ కేసులు బనాయించారు. పోలీస్ బలగాలను ఉపయోగించి అనేక వేధింపులకు గురి చేశారు. ఎస్టీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ఎస్సీలపైనే ప్రయోగించారు. హైకోర్టు తీర్పు