సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. సాయంత్రం సుమారు 7గంటల ప్రాంతంలో కాంప్లెక్స్లోని 7వ అంతస్తులో అంటుకున్న మంటలు నిమిషాల వ్యవధిలోనే 5,6,7 అంతస్తులకు వ్యాపించాయి. 5వ అంతస్తులో పేలుడు సంభవించడంతో మంటలు తీవ్రమయ్యాయి. ఇందులో వస్త్ర దుకాణాలతోపాటు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు, కాల్ సెంటర్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఉండటంతో నిత్యం రద్దీగా కన్పిస్తుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో పనిచేసే వారితోపాటు షాపింగ్కు వచ్చిన వారంతా కిందికి దిగిపోయారు. మంటల్లో దాదాపు 15 మందికి పైగా చిక్కుకుపోవడంతో అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద భారీ క్రేన్ల సాయంతో కాపాడారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ప్రభుత్వ సిబ్బంది, ఫైర్ సిబ్బంది హుటాహుటిన స్పాట్కు చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు 15ఫైరింజన్ల సాయంతో మంటల్ని కంట్రోల్ చేశారు. ఈ మొత్తం ప్రమాదంలో ఫైర్ సిబ్బంది 12మందిని కాపాడగా ఆరుగురు ప్రాణాలు విడిచారు. స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్లలో ప్రమీల (22), శ్రావణి (22), శివ (22)లు మరణించినట్లు ధ్రువీకరించారు. అపోలో ఆసుపత్రిలో ప్రశాంత్ (23) కన్నుమూశారు.వీరిలో కొందరు వరంగల్ జిల్లాకు చెందినవారు కాగా ప్రశాంత్ కేసముద్రం, ప్రమీల సురేష్నగర్ మహబూబాబాద్ జిల్లా వాసులు. త్రివేణి ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన వారు. కాగా సుధీర్రెడ్డి, శ్రావణ్, దయాకర్, భారతమ్మ, పవన్, రవి, గంగయ్యలను అగ్నిమాపక సిబ్బంది రక్షించి సమీప ఆసుపత్రిక తరలించారు. వీరంతా 4 గంటలపాటు పొగలో చిక్కుకుని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దాదాపు మూడు గంటలపాటు మంటలు తగ్గినట్టే తగ్గి మళ్లీ వ్యాపిస్తుండడంతో అప్రమత్తమైన అగ్నిమాపక అధికారులు.. అదనపు ఫైరింజన్లను రప్పించారు. అగ్నిప్రమాద సమాచారం తెలియగానే.. నార్త్జోన్ డీసీపీ చందనాదీప్తి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాగా.. మంత్రి తలసాని శ్రీనివాస కూడా ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.