బీహార్లో నితీశ్ కుమార్కు చెందిన జేడీయూ, తేజస్వి యాదవ్ కు చెందిన ఆర్జేడీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని వీరి మహాఘటబంధన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, బీహార్కు చెందిన ప్రశాంత్ కిశోర్ స్పందించారు. వీరు ప్రకటించినట్టు 10 లక్షల ఉద్యోగాలను ఒకటి లేదా రెండేళ్లలో కల్పిస్తే తాను నితీశ్ కుమార్కు పూర్తిగా మద్దతును ప్రకటిస్తానని చెప్పారు. అంతేకాదు, తాను చేపట్టిన ‘జన్ సూరజ్ అభియాన్’ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని కూడా ఆపేస్తానని తెలిపారు. బీహార్ లోని సమస్తిపూర్ లో తన మద్దతుదారులతో ఆయన మాట్లాడుతూ… నితీశ్ కుమార్ సీఎం కుర్చీకి ఫెవికోల్ అంటించుకుని కూర్చున్నారని.. మిగతా పార్టీలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. తాను బీహార్ రాజకీయాల్లోకి ప్రవేశించి కేవలం మూడు నెలలు మాత్రమే అవుతోందని… ప్రస్తుతం బీహార్ రాజకీయాలు 180 డిగ్రీల మలుపు తీసుకున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎన్నో రాజకీయ తిరుగుబాట్లను చూస్తామని జోస్యం చెప్పారు.