అదనపు డీజీగా ఎన్.సంజయ్ బాధ్యతలు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : అత్యంత వివాదాస్పద అధికారిగా విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీ చేసింది. అయితే ఇది బదిలీ వేటా? లేక సాధారణ బదిలీయా అనేది తేలాల్సి ఉంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కేసుతో పాటు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్యనేతలకు మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు జారీ చేయడం, అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నేతలపై ఇచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వారిని విచారణకు పిలిపించడం, సోషల్ మీడియాలో పాలకపక్ష నేతలపై ఎవరు పోస్టింగ్ చేసినా వారిపై కేసులు నమోదు చేయడం, అధికారపార్టీ నేతలు ప్రతిపక్ష నేతలపై అసభ్యంగా పోస్టులు పెట్టినా పట్టించుకోకపోవడం వంటి అనేక అంశాల్లో సునీల్కుమార్పై తీవ్ర విమర్శలున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు అనేకసార్లు డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో ఆయన బదిలీ కావడం గమనార్హం. సునీల్కుమార్ను సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించగా, ఈ బదిలీ సాధారణ అంతర్గత బదిలీల్లో భాగంగానే జరిగినట్లు అధికారపార్టీ నేతలు పేర్కొంటున్నారు. సీఐడీ అదనపు డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం విపత్తు నిర్వహణ డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు.