న్యూదిల్లీ : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 4,5 తేదీలలో ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయం అజయ్ భవన్లో జరిగాయి. పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలలో జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై భవిష్యత్ పోరాట కార్యాచరణను సమావేశం రూపొందించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి డి. రాజా రాజకీయ పరిణామాలపై నివేదికను ఇచ్చారు. వివిధ రాష్ట్రాల కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు చర్చలలో పాల్గొన్నారు. సాగు చట్టాల రద్దుకు రైతాంగం కొన్ని నెలలుగా జరుపుతున్న ఆందోళనకు పార్టీ మద్దతును పునరుద్ఘాటించింది. 19 రాజకీయ
పార్టీల పిలుపు మేరకు ఈ నెలలో జరగనున్న ప్రచారాందోళన జయప్రదానికి కృషిచేయాలని పార్టీ శ్రేణులకు సమావేశం పిలుపునిచ్చింది. అనేక సమస్యలపై వివిధ తీర్మానాలను ఆమోదించింది. సమావేశానికి జాతీయ కార్యదర్శులు అతుల్కుమార్ అంజన్, డాక్టరు కె. నారాయణ, అమర్జిత్ కౌర్, కాంగో, పల్లవ్సేన్ గుప్తా, వివిధ రాష్ట్రాల కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.
ఇటీవల కాలంలో మృతిచెందిన వారికి సంతాపం తెలుపుతూ సమావేశం రెండు నిముషాలు మౌనం పాటించింది.