సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. ఒక్కరోజే తొమ్మిది మంది సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణస్వీకారం చేశారు. న్యాయమూర్తులచేత సీజేఐ జస్టిస్ ఎన్ వి రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల 9 మందిని సుప్రీంకోర్టు జడ్జీలుగా కొలీజియం సిఫారసు చేసింది. కరోనా ప్రభావం వల్ల ఒకటో నెంబర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు అదనపు భవన సముదాయ ఆడిటోరియానికి ప్రమాణ స్వీకార కార్యక్రమం మార్పు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయాలని సీజేఐ నిర్ణయించారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి ప్రత్యక్ష ప్రసారమైన జడ్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమం.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వెంకటరామయ్య నాగరత్న, జస్టిస్ చుడలయిల్ తేవన్ రవికుమార్, జస్టిస్ వీ.వీ.సుంద్రేష్, జస్టిస్ బేలా మాధుర్య త్రివేది, జస్టిస్ పమిడిఘఠం శ్రీ నర్సింహ కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తొమ్మిది మంది న్యాయమూర్తుల ప్రమాణస్వీకారంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి పెరిగింది.