హైదరాబాద్:
సూపర్స్టార్ కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి స్వల్ప గుండెపోటు, శ్వాస సంబంధిత సమస్య రావడంతో కుటుంబ సభ్యులు ఇంటి సమీపంలో ఉన్న కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో వైద్యులు సీపీఆర్ చేసి చికిత్స అందించారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ ఎండీ గురునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఆదివారం అర్ధరాత్రి కృషగారిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. గుండెపోటు రావడంతో ఎమర్జెన్సీకి తరలించి సీపీఆర్ చేశాం. 20 నిమిషాల తర్వాత ఆయన కార్డియక్ అరెస్ట్ నుంచి బయట కొచ్చారు. ఐసీయూకి తరలించి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. 24 గంటల తర్వాత గానీ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేం. మంగళవారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేస్తాం’’ అని తెలిపారు. మహేశ్ సహా కుటుంబ సభ్యులంతా ఆస్పత్రి దగ్గరే ఉన్నారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న అభిమానులు ఇప్పటికే ఆస్పత్రికి చేరుకున్నట్లు తెలుస్తోంది.