Friday, April 19, 2024
Friday, April 19, 2024

యెమెన్‌లో తీరని విషాదం.. తొక్కిసలాటలో 85 మంది మృతి

ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ మాసం ముగింపునకు ముందు అరేబియాలోని అత్యంత పేద దేశమైన యెమెన్‌లో తీరని విషాదం నెలకొంది. ఈదుల్ ఫితర్‌ను పురస్కరించుకుని నిర్వహించిన ఓ చారిటీ పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 80 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వందలాదిమంది గాయపడ్డారు. ఇది ఈ దశాబ్దంలోనే ఘోరమైన తొక్కిసలాట అని హుతీ అధికారులు పేర్కొన్నారు. బాబల్ యెమెన్ జిల్లాలో జరిగిన ఈ తొక్కిసలాటలో 85 మంది మరణించారని, 322 మంది గాయపడ్డారని తెలిపారు.మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. ఓ స్కూల్‌లో సహాయ సామగ్రి పంపిణీ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. యుద్ధంతో దారుణంగా దెబ్బతిన్న పేద దేశమైన యెమెన్‌లో సహాయ సామగ్రి కోసం వందలాదిమంది స్కూలు వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట పెను ప్రాణ నష్టానికి దారితీసింది.మృతదేహాలు కుప్పలుగా పడివున్న దృశ్యాలను స్థానిక టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. సహాయక సామగ్రిని సొంతం చేసుకునేందుకు జనం పోటీపడడం, ఒకరినొకరు నెట్టుకుంటూ, ఒకరి తలపై మరొకరు నడుచుకుంటూ వెళ్లడంతోనే ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా పేర్కొంది.మృతదేహాలతోపాటు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తొక్కిసలాటకు కారణమైన వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారన్న కచ్చితమైన సమాచారం తెలియరాలేదు. అయితే, కొందరు వ్యాపారులు డబ్బులు పంపిణీ చేయడంతోనే ఈ ఘటన జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.ఈ ఘటనపై విచారణ జరపనున్నట్టు హుతీ రాజకీయ ముఖ్యుడు మహదీ అల్ మషట్ తెలిపారు. తొక్కిసలాటకు కారణమైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు భద్రతా దళాలు ప్రకటించాయి. యెమెన్‌లో 8 ఏళ్లకుపైగా జరిగిన అంతర్యుద్ధం ప్రపంచంలో అత్యంత ఘోరమైన మానవతా విషాదాలలో ఒకటిగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img