Friday, April 19, 2024
Friday, April 19, 2024

హిందూత్వ సెగ

ఎన్నికల వేళ మతవిద్వేషం ఉచ్చులో భారత్‌
ఓట్ల కోసమే హిజాబ్‌పై కాషాయ పార్టీ రభస

న్యూదిల్లీ: ఎన్నికల వేళ మతవిద్వేషం ఉచ్చులో భారత్‌ చిక్కుకుపోతోంది. దేశంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ మత ఘర్షణలను రెచ్చగొట్టడం కాషాయ మూకలకు కొత్త కాదు. హిందూముస్లిం అంటూ గొడవ చేయడంతో హిందూ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. మానవహక్కుల హరణ, రాజ్యాంగ ఉల్లంఘనలు, ప్రజాకార్మిక`రైతు వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలతో సాగిన పాలన ముగింపు దశకు చేరుకునే సమయంలో తాజాగా ‘హిజాబ్‌’ వివాదం వల్ల మరోమారు ప్రజలపై హిందూత్వ వల వేస్తూ వారి విశ్వాసాన్ని పొందే ప్రయత్నాన్ని చేస్తోంది. కోవిడ్‌ వల్ల రెండేళ్ల పాటు కష్టాల కడలిని ఎదురీదుతూ ఆశల పల్లకిపై 2022 సంవత్సరంలోని అడుగు పెట్టిన సమయంలో దక్షిణ భారతంలో ఉనికిని చాటేందుకు కర్ణాటక ద్వారా కొత్త వివాదానికి తెరతీసింది. గతసారి ఎన్నికలప్పుడు అంటే 2019లో పుల్వామా ఘటన బీజేపీకి ఓ విధంగా కలిసివచ్చింది. కోవిడ్‌ నేపథ్యంలో వెనుకడుగు వేయాల్సి వచ్చిన కారణంగా ‘హిజాబ్‌’ను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని కమలం దళం యోచిస్తోంది. 37 ఏళ్ల కిందట భర్త నుంచి విడాకులు పొందిన 62ఏళ్ల ముస్లిం మహిళ షా బానోకు అనుకూలంగా ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. క్రిమినల్‌ కోడ్‌లోని 125 సెక్షన్‌ ప్రకారం ఇతర మతాలవారి వలే ఈమెకు భరణం పొందే హక్కు ఉందని తెలిపింది. అప్పట్లో ఈ తీర్పు వివాదానికి తెరతీసింది. ముస్లిం సంఘాల నుంచి నిరసన వ్యక్తం అయింది. దీంతో వెంటనే స్పందించిన రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం ముస్లిం మహిళల (విడాకుల హక్కు పరిరక్షణ) చట్టాన్ని తీసుకు వచ్చింది. ఇరు వర్గాల అంగీకారం మేరకు నిర్ణయించే మొత్తాన్ని భరణంగా పొందేందుకు ముస్లిం మహిళలకు ఈ చట్టం హక్కు కల్పించింది. బాబ్రీ మసీదు అంశం నేపథ్యంలో హిందూత్వ పునరుద్ధరణకు షాబానో కేసు దోహదం చేసింది. ప్రస్తుతం కర్ణాటకలోని హిజాబ్‌పై కాషాయ వివాదం కూడా మోదీ ప్రభుత్వానికి అదే విధంగా పరిణమిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. హిజాబ్‌ ధరించి ఉడిపిలోని మహాత్మాగాంధీ మెమోరియల్‌ కాలేజికి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను తరగతి గదుల్లోకి ప్రవేశాన్ని నిరాకరించడంతో జనవరి 1న వివాదం మొదలైంది. మైనారిటీ విద్యార్థులమనే ఆంక్షలు విధిస్తున్నారన్నారు. హిందూ ఓట్ల కోసం మోదీ ప్రభుత్వం మైనారిటీల హక్కులను హరిస్తోందన్నారు. ఇన్నేళ్లుగా లేని సమస్య ఆకస్మికంగా ఎన్నికల వేళ ఎందుకు వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి అనేకమంది రాజకీయ విశ్లేషకులు చెప్పిన సమాధానం ఒక్కటే. ఇది బీజేపీ సృష్టి అని.. ఎన్నికల్లో లబ్ధి కోసం కర్ణాటక మాధ్యమంగా మతతత్వాన్ని రెచ్చగొట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా హిజాబ్‌ వర్సెస్‌ యూనిఫారం వివాదాన్ని మొదలు పెట్టిందని అంటున్నారు. ఈ పరిణామం ముస్లిం విద్యార్థినులకు హిజాబ్‌ లేదా తమ విద్యాభ్యాసాన్ని ఎంచుకోవాలన్న పరిస్థితికి దారితీసింది. దీనిపై ఫిబ్రవరి 11న న్యూయార్క్‌ టైమ్స్‌లో వార్తానివేదిక ప్రచురితమైంది. హిజాబ్‌పై నిషేధంతో విద్యార్థినుల మత, విద్యాస్వేచ్ఛకు విఘాతం కలిగిందని ఐదుగురు విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లారు. రాష్ట్రంలోని స్కూళ్లలో హిజాబ్‌ను నిషేధిస్తూ ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పుకు వత్తాసు పలికింది. ప్రిన్సిపాల్‌ రుద్రగౌడ స్పందిస్తూ కాలేజిలో హిజాబ్‌పై నిషేధం లేదుగానీ విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లే ముందు దానిని తీసివేయాల్సి ఉంటుందని, 35 ఏళ్లుగా ఇదే జరుగుతోందన్నారు. కాలేజిలో 60 మంది ముస్లిం విద్యార్థులు ఉండగా ఆరుగురు మాత్రమే దీనిని పెద్దది చేశారని ఆరోపించారు. ఆ విద్యార్థినుల్లో ఒకరైన లీఫా మహక్‌ న్యూయార్క్‌ టైమ్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏడాది కిందట ఇనిస్టిట్యూట్‌లో చేరినప్పుడు హెడ్‌స్కాఫ్‌ ధరించడంపై యంత్రాంగం నుంచి అభ్యంతరం వ్యక్తం కాలేదని తెలిపారు. ఇదే తరణంలో సీఎఫ్‌ఐ (క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా) పేరు తెరపైకి వచ్చింది.
కొందరు ముస్లిం విద్యార్థులు ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యార్థి సంఘమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ నిర్వహించిన ఆందోళనలో పాల్గొనడం సీఎఫ్‌ఐకి మింగుడు పడలేదని, అందుకే విద్యార్థినులతో విలేకరుల సమావేశాన్ని పెట్టించి ఈ వివాదాన్ని పెద్దది చేసిందని ఓ వార్తాసంస్థ పేర్కొంది. అయితే ఇక్కడ కాస్త ఆశాజనకం ఏమంటే ఇది ఉత్తరప్రదేశ్‌ కాకపోవడం, ఇక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కాదు బసవరాజ్‌ బొమ్మ కావడం. కర్ణాటక ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయాన్ని చట్టానికే వదిలివేసింది. చట్టం, రాజ్యాంగాధారిత పరిష్కారానికి కట్టుబడి ఉంటామని చెబుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img