కర్ణాటకలో హిజాబ్ బ్యాన్ వివాదంపై సుప్రీంకోర్టులో భిన్న తీర్పులు వెలువడ్డాయి. ఈ అంశంపై గతంలో సుదీర్ఘంగా విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో ఉంచింది. తాజాగా దానిపై ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తంచేస్తూ భిన్న తీర్పులు వెలువరించారు. ఈ కేసులో వాదనలు విన్న జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుదాన్షు ధూలియాతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 22న తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పు వెలువరించాల్సి ఉంది. కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలను సమర్థిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు. కానీ, జస్టిస్ సుదాన్షు ధూలియా మాత్రం హిజాబ్ ధారణపై కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేశారు. ఏకాభిప్రాయం కొరవడడంతో ఇప్పుడు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ కు నివేదించారు. దీంతో ఈ కేసు విచారణ కోసం మరింతమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. విద్యా సంస్థల్లో అన్ని మతాల మధ్య ఏకరూపతకు వీలుగా హిజాబ్ ధారణను నిషేధించినట్టు కర్ణాటక సర్కారు సమర్థించుకుంది. ఈ నిషేధం వల్ల ముస్లిం విద్యార్థినులు తరగతులకు హాజరు కాలేరని పిటిషన్ తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా ధర్మాసనానికి విన్నవించారు. కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలకు అనుకూలమైన తీర్పును ఆ రాష్ట్ర హైకోర్టు ఈ ఏడాది మార్చిలో జారీ చేసింది.