బతికేవున్నాడని మావోయిస్టు పార్టీ ప్రకటన
విశాలాంధ్ర-చింతూరు (అల్లూరి జిల్లా): చత్తీస్గఢ్ దండకారణ్యంలో జరిగిన కాల్పులపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేరున లేఖ విడుదల చేసింది. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్ సంతోశ్ చనిపోలేదని పేర్కొన్నది. హిడ్మా చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఆయన సురక్షితంగా ఉన్నాడని వెల్లడిరచింది. దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతం కొండలపై పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు డ్రోన్లు, హెలికాప్టర్లతో దాడులు చేశాయని, గతేడాది ఏప్రిల్లోనూ వైమానిక బాంబు దాడి జరిగిందని ఆ లేఖ వివరించింది. ‘మావోయిస్ట్ పార్టీ నాయకత్వం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని దెబ్బతీయాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారు.
రాత్రీ పగలు తేడా లేకుండా హెలికాప్టర్ల ద్వారా నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికలలోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటించారు. దీనిలో భాగంగానే తమపై ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. పాలకవర్గాలకు వ్యతిరేకంగా ప్రపంచంలోని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య కూటములు ఏకం కావాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.